APCC YS Sharmila Post About Fee Reimbursement Scheme :ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత, తన సోదరుడు వైఎస్ జగన్పై కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మండిపడ్డారు. వైఎస్ఆర్ తన జీవితం మొత్తం దేనికైతై వ్యతిరేకంగా ఉన్నారో వాటన్నింటినీ జగన్ చేశారని ధ్వజమెత్తారు. బీజేపీకి దత్తపుత్రుడుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ విధంగా షర్మిల ఎక్స్ వేదికగా ఫీజ్ రీయింబర్స్మెంట్ విషయంలో గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ పోస్ట్ చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అప్పటి జగన్ ప్రభుత్వం నీరుగార్చిందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడారని మండిపడ్డారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఈ క్రమంలో వైఎస్ఆర్ హయాంలో కాంగ్రెస్ పార్టీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేశారని గుర్తుచేశారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపి, ఎంతో మందిని ఇంజినీర్లు, డాక్టర్లుగా తీర్చిదిద్దిన గొప్ప పథకం అది కొనియాడారు. అలాంటి పథకాన్ని జగన్ నీరుగార్చారని అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.3500 కోట్లు పెండింగ్లో పెట్టడం సిగ్గుచేటని అన్నారు. బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడారని మండిపడ్డారు. జగన్ హయాంలో విద్యార్థుల తల్లిదండ్రులను మనోవేదనకు గురిచేశారన్నారు. దోచుకుని దాచుకోవడంపై ఉన్న శ్రద్ధ, విద్యార్థుల సంక్షేమంపై పెట్టలేదని షర్మిల పేర్కొన్నారు.