Kadambari Jethwani Case :ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశంగా మారిన ముంబయి నటి వేధింపుల వ్యవహారంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నిలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ముంబయి సినీ నటి కాదంబరీ జత్వాని కేసు వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన అభియోగాలపై ముగ్గురు ఐపీఎస్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ముంబయి నటి కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, ఆమెను వేధించిన పోలీసులపై చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ ఘటనపై ఇబ్రహీంపట్నం పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అదే విధంగా విజయవాడలో పని చేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం.సత్యనారాయణలను సస్పెండ్ చేశారు. తాజాగా ఈ కేసులో కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన ఐపీఎస్లు పి. సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీలపై చర్యలు తీసుకున్నారు.
వారిపై కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు :మరోవైపు ఫోర్జరీ పత్రంతో తనపై తప్పుడు కేసులతో అరెస్టు చేసి ఇబ్బందులకు గురిచేసిన వ్యవహారంలో అప్పటి నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్ని, వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్లపై కేసు నమోదు చేయాలని ముంబయి నటి ఫిర్యాదు చేశారు.