ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాహనదారులకు గుడ్​ న్యూస్ - రవాణాశాఖలో మళ్లీ 'స్మార్ట్​'కార్డులు

వచ్చే వారం నుంచి ఆర్సీ, డ్రైవింగ్‌ లైసెన్సులకు కార్డుల ఆప్షన్‌ - స్మార్ట్‌కార్డుల సరఫరాకు టెండర్లు సిద్ధం

AP RTA Smart Cards
AP RTA Smart Cards (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

AP RTA Smart Cards :నూతన వాహనం కొనుక్కుని, రవాణా శాఖలో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాక ఇచ్చే రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ (ఆర్సీ), డ్రైవింగ్‌ లెసెన్స్ పొందినప్పుడు అందజేసే డీఎల్‌ కార్డుల జారీ మళ్లీ మొదలవుతోంది. వైఎస్సార్సీపీ సర్కార్ ఈ స్మార్ట్‌కార్డులను కూడా వాహనదారులకు అందజేయడం చేతకాక ఈ విధానాన్నే పూర్తిగా పక్కనపెట్టేసింది. కూటమి ప్రభుత్వం వచ్చే వారం నుంచి ఆన్‌లైన్‌లో ఆప్షన్‌ తీసుకుని నవంబర్ నుంచి కార్డులు జారీ చేయనుంది.

ఆంధ్రప్రదేశ్​లో రోజుకు సగటున 10,000-12,000ల ఆర్సీ, డీఎల్‌ కార్డుల చొప్పున నెలకు 3 లక్షలు, ఏడాదికి దాదాపు 36 లక్షల కార్డులు అవసరం. గతంలో ఈ స్మార్ట్‌కార్డులను గుత్తేదారు సరఫరా చేశాక జిల్లా రవాణా శాఖ, ఆర్టీవో కార్యాలయాల్లో వాటిపై వివరాలు ముద్రించి, వాహనదారుల ఇళ్లకు స్పీడ్‌ పోస్టులో పంపేవారు. దీని కోసం రూ.200 ఫీజు, స్పీడ్‌ పోస్ట్‌ ఖర్చు కూడా వసూలు చేసేవారు. స్మార్ట్‌కార్డు సరఫరా, దానిపై వివరాల ముద్రణకు గరిష్ఠంగా రూ.70 వరకు ఖర్చు అవుతుంది. అంటే ప్రభుత్వానికి ఒక్కో కార్డుపై రూ.130 వరకు మిగులుతుంది. అయినా కూడా వైఎస్సార్సీపీ సర్కార్ ఈ కార్డులు జారీ చేయలేక చేతులెత్తేసింది.

గుత్తేదారుకు బిల్లులివ్వక : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వాహనం రిజిస్ట్రేషన్‌ చేసుకున్న సంవత్సరానికి కూడా ఆర్సీ కార్డు వాహనదారుడికి చేరడం కష్టంగా ఉండేది. స్మార్ట్‌కార్డులు సరఫరా చేసిన గుత్తేదారుకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించకుండా సర్కార్ రూ.కోట్లలో బకాయిలు పెట్టింది. దీంతో గుత్తేదారు కార్డుల సరఫరా నిలిపేసేవారు. రూ.200 ఫీజు తీసుకున్నాక కూడా స్మార్ట్‌కార్డులు ఎందుకు సరఫరా చేయలేకపోతున్నారని వాహనదారులు ఆర్టీవో కార్యాలయాలకు వచ్చి నిలదీసేవారు.

ప్రభుత్వ తీరుతో విసుగెత్తిపోయిన రవాణాశాఖ అధికారులు గత సంవత్సరం జులై నుంచి స్మార్ట్‌కార్డుల జారీ విధానాన్ని పూర్తిగా నిలిపేశారు. ఆర్సీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌ను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకొని జీరాక్స్‌ కాపీ వాహనదారుల వెంట ఉంచుకుంటే చాలని ప్రకటించారు. అయితే వాహనదారులు ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు అక్కడ తనిఖీల సమయంలో ఆర్సీ, డీఎల్‌ కార్డులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇకపై జాప్యం లేకుండా సరఫరా :కూటమి ప్రభుత్వం వచ్చాక స్మార్ట్‌కార్డుల జారీకి రవాణా శాఖకు ఆదేశాలిచ్చింది. నవంబర్ మొదటి వారం నుంచి వాహన్, సారథి పోర్టల్‌లో ఈ కార్డుల కోసం ఆప్షన్‌ ఇవ్వనున్నారు. దీనికి రూ.200 ఫీజుతోపాటు, స్పీడ్‌పోస్టు ఛార్జి రూ.35 ఆన్‌లైన్‌లోనే తీసుకుంటారు. స్మార్ట్‌కార్డుల సరఫరాకు టెండర్లు పిలిచేందుకు రవాణాశాఖ ఫైల్​ సిద్ధం చేసింది. ఈ మేరకు దస్త్రాన్ని ప్రభుత్వానికి పంపింది. అక్కడి నుంచి క్లియరెన్స్‌ రాగానే టెండర్లు పిలిచి, సరఫరాదారును ఎంపిక చేయనున్నారు.

రికమండేషన్స్-ఫార్మాలిటీస్​ పనిచేయవ్! డ్రైవింగ్ లైసెన్స్ జారీలో ఆర్టీఏ కొత్త విధానం - Automatic Driving Testing Track

రవాణా శాఖ ఆదాయం.. రయ్‌..రయ్‌

ABOUT THE AUTHOR

...view details