AP Assembly Committees Election: అసెంబ్లీ ఆర్థిక కమిటీల్లో సభ్యుల ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఏ ఎమ్మెల్యే ఎవరికి ఏ సంఖ్య క్రమంలో ఓటు వేయాలో ఎన్డీఏ కూటమి విప్లకు బాధ్యత అప్పగించింది. ప్రజాపద్దులు(పీఏసీ), అంచనాలు(ఎస్టిమేట్స్), ప్రభుత్వ రంగ సంస్థల(పీయూసీ) కమిటీలకు పోలింగ్ జరుగుతుంది. అసెంబ్లీ కమిటీ హాలులో ఉదయం 9 నుంచి మధ్యహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
ప్రాధాన్య ఓట్ల విధానంలో బ్యాలెట్ పత్రాలపై ఎమ్మెల్యేలు వారి ఓట్లు నమోదు చేయనున్నారు. అసెంబ్లీ ఆర్థిక కమిటీల్లో ఏదైనా పార్టీ నుంచి ఒక సభ్యుడు ఎన్నికవ్వాలంటే ఆ పార్టీకి శాసనసభలో ఉండాల్సిన కనీస సంఖ్యాబలం 18 ఉండాలి. కేవలం 11 మంది సభ్యుల సంఖ్యాబలంతో మూడు కమిటీలకూ ముగ్గురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు నామినేషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్యేల కోటాలో 9కి గాను మొత్తం 10 చొప్పున నామినేషన్లు దాఖలవ్వటంతో పోలింగ్ అనివార్యమైంది.