ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

24 అంశాలపై చర్చకు రె'ఢీ' అంటున్న కూటమి - అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి - AP ASSEMBLY BUDGET SESSION

తొలిసారి పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన కూటమి - దాదాపు 3 వారాల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం

AP Assembly Budget Session 2025
AP Assembly Budget Session 2025 (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 23, 2025, 7:40 PM IST

Updated : Feb 23, 2025, 8:16 PM IST

AP Assembly Budget Session: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. సోమవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్దం చేసింది. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించాక సభ వాయిదా పడనుంది. అనంతరం జరిగే శాసనసభ సలహా కమిటీ సమావేశం (BAC)లో అసెంబ్లీ ఎన్నిరోజులు నడపాలన్నది నిర్ణయించనున్నారు. ఎన్నికల హమీల అమలుకు ప్రాధాన్యం ఇస్తూ ఈ నెల 28వ తేదీన 2025-26వార్షిక బడ్జెట్​ను ఉభయ సభల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. దాదాపు 3 వారాల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

15% వృద్ధి సాధనే లక్ష్యంగా బడ్జెట్‌ రూపకల్పన: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గత ఎనిమిది నెలల్లో ప్రభుత్వం సాధించిన ప్రగతి, అందిస్తున్న సంక్షేమం, 2047 లక్ష్యాలు, ఆర్థిక ఇబ్బందులు తదితర అంశాలపై గవర్నర్ ప్రసంగం ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 28వ తేదీన 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్​ను చట్టసభలకు సమర్పించనున్నారు. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లుగా బడ్జెట్ రూపకల్పన చేసినట్లు సమాచారం. 15% వృద్ధి సాధనే లక్ష్యంగా బడ్జెట్‌ రూపకల్పనపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. కిందటి ఏడాది సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడంతో తొలుత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్​ను పాత ప్రభుత్వం సభకు సమర్పించింది.

రాష్ట్ర నావకు ఒక దిక్సూచిలా బడ్జెట్: ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు, అప్పులు ఇతరత్రా అంశాల కారణంగా మరో నాలుగు నెలల కాలానికి ఓట్ ఆన్ అకౌంట్​ను సమర్పించింది. రాష్ట్ర నావకు ఒక దిక్సూచిలా నిలిచి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను, అభివృద్ధిని గాడిన పెట్టడంలో ఈ నెల 28న ప్రవేశపెట్టే పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ ఎంతో కీలకం కానుంది. ఎన్డీయే ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు, మేనిఫెస్టోలో అంశాలకు ఈ బడ్జెట్​లో స్థానం కల్పించాల్సి ఉన్నందున, అందుకు తగ్గట్టుగా దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది. హామీల అమలుకు తగ్గట్టుగా వనరుల సమీకరణ ఇక్కడ కీలకం కానుంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది.

కేంద్ర పథకాలను వీలైనంతగా వినియోగించుకుని: ముఖ్యమంత్రి ఆర్ధికశాఖ అధికారులతోను, ఆర్ధిక మంత్రితోను బడ్జెట్ రూపకల్పనపై ఇప్పటికే పలుమార్లు సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్ని ప్రభుత్వశాఖలకు సంబంధించిన మంత్రులు, ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో బడ్జెట్ ప్రతిపాదనలపై కూలంకషంగా చర్చించారు. ఆయా శాఖల్లో వారి ప్రాధాన్యాలపై చర్చించారు. రాష్ట్ర ఆర్థిక చిత్రం పరిమితులు ప్రకారం బడ్జెట్ రూపకల్పన చేసినట్లు సమాచారం. శాఖల వారీగా వారి ప్రాధాన్యాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ఆర్థిక చిత్రం పరిమితులు కూడా తెలుపుతూ ఎన్నికల హామీల ప్రకారం బడ్జెట్ రూప కల్పన, అందుకు తగ్గట్టుగా కేటాయింపులు ఉండనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రాయోజిత పథకాలను వీలైనంతగా వినియోగించుకుని కేంద్రం నుంచి నిధులు రాబట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. విద్యా, వైద్య శాఖల ద్వారా కేంద్రం నుంచి అదనపు నిధులు లభించవచ్చని అంచనా వేస్తున్నారు.

అసెంబ్లీ సమావేశాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు - రాకపోకలు, ప్రవేశాలపై నిబంధనలు

సూపర్ సిక్స్ పథకాలకు కేటాయింపులు:గత ఏడాది జూన్​లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్‌ మొత్తాన్ని పంపిణీ చేస్తుండటంతో పాటు దీపం-2, అన్న క్యాంటీన్లు ఇప్పటికే ప్రారంభించింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం భవిష్యత్తు ఆదాయాలను వాడేయటంతో పాటు మూలధన వ్యయానికి ఖర్చు చేయకపోవడంతో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉచిత ఇసుక విధానం అమలు చేయడంతో ఆదాయం తగ్గింది. పోలవరం, అమరావతి ప్రాజెక్టులకు కేంద్రం సాయం చేయడం కొంతమేర ఊరటనిచ్చింది. ఈ ఏడాది నుంచి సూపర్ సిక్స్ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నందున బడ్జెట్‌లో అందుకు తగ్గ కేటాయింపులపై కీలకం కానున్నాయి.

తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు వంటి పథకాలను ఈ ఏడాది నుంచి శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అటు పథకాలు, ఇటు అభివృద్ది కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ బడ్జెట్‌ కేటాయింపులు చేయడం సర్కారుకు సవాల్‌గా మారింది. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రమే సాయం చేస్తున్నందున మిగిలిన ప్రాజెక్టులైన హంద్రీనీవా, వెలిగొండ, చింతలపూడి ఎత్తిపోతల, వంశధార, మహేంద్రతనయ, గాలేరు నగరి తదితర ప్రాజెక్టులతో పాటు ఇతర ప్రాజెక్టులకు నిధులు అవసరం ఉంది. ప్రధానంగా ప్రాజెక్టుల నిర్వహణ నిధులు, గోదావరి, కృష్ణా కరకట్టలు, డెల్టా కాలువల ఆధునికీకరణకు ఖర్చు చేయాల్సి ఉంది.

సభకు వచ్చే ఆలోచనలో వైఎస్సార్సీపీ: ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో ప్రతిపక్షం లేకపోవటంతో ఆ పాత్ర కూడా అధికారపక్షమే పోషించాల్సిన పరిస్థితి నెలకొంది. గవర్నర్ ప్రసంగం వరకూ వస్తానని వైఎస్సార్సీపీ ప్రకటించటం కూడా అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు వేసిన ఎత్తుగడే అనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. గవర్నర్ ప్రసంగం సాకుతో ఒకసారి సభకు హాజరై సంతకం పెడితే మరో 60 రోజుల వరకూ హాజరుకాకున్నా ఏం కాదనే భావనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ మినహా మిగిలిన 10 మంది సభ్యులు సభకు వచ్చే ఆలోచనా ఆ పార్టీ చేస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కనీసం బీఏసీ సమావేశానికి కూడా వైఎస్సార్సీపీ హాజరు కాలేదు.

అసెంబ్లీకి రానున్న వైఎస్ జగన్! - ఈసారి ఎన్ని రోజులు ఉంటారో?

24 అంశాలపై చర్చించేందుకు సిద్ధం: సభలో చర్చించేందుకు మొత్తం 24 అంశాలను అధికారపక్షం సిద్ధం చేసింది. ఇందులో ప్రధానంగా 8 నెలల ప్రభుత్వ విజయాలు, పోలవరం-బనకచర్ల అనుసంధానం, ప్రజా రాజధాని అమరావతి, రహదారుల నిర్మాణం మరమ్మతులు, ఆర్ అండ్ బి, దావోస్ పర్యటన, పెట్టుబడులు యువతకు ఉపాధి, స్వర్ణాంధ్ర విజన్ 2047, ఇండస్ట్రీయల్ పాలసీ, ఐటీ పాలసీ వంటి అంశాలు ఉన్నాయి. గత ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి కుంభకోణాలు, అటవీ భూములు, మఠ భూములు, రెవిన్యూ భూములు కబ్జా, మద్యం కుంభకోణం, కాకినాడ పోర్టు కుంభకోణం, అటవీ భూముల కుంభకోణం వంటి అంశాలపైనా చర్చించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

పెండింగ్ బకాయిలు-చెల్లింపు, వాట్సాప్ గవర్నన్స్ 161 సేవలతో మన మిత్ర, ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లింపులు, విద్యారంగం బలోపేతానికి చర్యలు, రెవెన్యూ సదస్సులు పరిష్కరించిన అంశాలు వంటి అంశాలు అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు రానున్నాయి. ధాన్యం, మిర్చి, పత్తి కొనుగోళ్లు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వ రాయితీలు, ఎన్టీఆర్ ఆరోగ్య సేవ, గులియన్ బారీ సిండ్రోమ్ (జీబీఎస్), కేంద్ర ప్రయోజిత పథకాలు కూటమి ప్రభుత్వ ప్రాధాన్యం, గత ప్రభుత్వ నిర్లక్యం, చేనేత పరిశ్రమకు ప్రోత్సాహకాలు, టిడ్కో ఇళ్ల నిర్మాణం అర్హులకు ఇళ్ల పట్టాల పంపిణీ వంటి అంశాలపై ప్రభుత్వం ఉభయ సభల్లో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రకృతి విపత్తులు రెట్టింపు సాయం, రేషన్ బియ్యం అక్రమ రవాణ, గుంటూరు మిర్చి యార్డులో అక్రమాలు, ఐటీడీఏలో సమస్యలు, పంచాయితీరాజ్ రహదారుల నిర్మాణం, జలజీవన్ మిషన్ వంటి అంశాలపైనా దాదాపు 3 వారాల పాటు జరిగే సమావేశాల్లో చర్చించనున్నారు.

పాస్​లు ఉంటేనే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతి:అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో రాకపోకలు, ప్రవేశాలపై ఉన్న నిబంధనల్ని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీడియా, విజిటర్లు, పోలీసు సిబ్బందికి ప్రత్యేక పాస్​లు జారీ చేశారు. భద్రతా కారణాల రీత్యా పాస్​లు ఉన్నవారిని మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతిస్తారు. అసెంబ్లీ, మండలిలో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేలా వివిధ కలర్ కోడ్​లతో పాస్​లు జారీ చేశారు. భద్రతా కారణాల రీత్యా సభ్యుల పీఏలు, వ్యక్తిగత సిబ్బందిని తీసుకురావొద్దని సభాపతి కార్యాలయం స్పష్టం చేసింది.

ఈ ఏడాదే తల్లికి వందనం, అన్నదాత, ఉచిత బస్సు - బడ్జెట్​పై చంద్రబాబు చర్చ

Last Updated : Feb 23, 2025, 8:16 PM IST

ABOUT THE AUTHOR

...view details