Jana Sena Legislative Party Meeting: వైఎస్సార్సీపీ సభ్యులు అసెంబ్లీలో అసభ్య పదజాలంతో రెచ్చగొట్టినా సరే జనసేన సభ్యులు సంయమనం కోల్పోవద్దని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. హుందాగా వ్యవహరించాలని పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో దిశానిర్దేశం చేశారు. గతంలో చట్టసభల్లో వాళ్ల భాష, విధానం ప్రజలంతా గమనించారని బురదలో కూరుకుపోయిన వైఎస్సార్సీపీ సభ్యులు దాన్ని మనకూ అంటించాలని చూస్తారని జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మాట్లాడే భాష విషయంలో జాగ్రత్త: ఇవాళ్టి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జనసేన కేంద్ర కార్యాలయంలో ఆదివారం సాయంత్రం పవన్ కల్యాణ్ అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. చట్టసభల్లో మాట్లాడే భాష, వాడే పదాల విషయంలో సభ్యులు జాగ్రత్తగా ఉండాలని వైఎస్సార్సీపీ ప్రతినిధుల దిగజారుడు వ్యాఖ్యల్ని పట్టించుకోవద్దని దిశానిర్దేశం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో సామాన్యుడి గొంతును సభలో బలంగా వినిపించాలని పవన్ కల్యాణ్ చెప్పారు.
ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ చర్చల్లో పాల్గొనాలి: అభ్యంతరకర పదజాలం వాడొద్దని తనతో సహా ప్రతి ఒక్కరూ గౌరవప్రదమైన పదాలే వినియోగించాలని చెప్పారు. చట్టసభల్లో మాట్లాడేది ప్రజలంతా గమనిస్తున్నారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. భాష విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలనే దానిపై నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ, మండలి బుద్ధప్రసాద్, హరిప్రసాద్ గైడ్ చేయాలని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు, ఆకాంక్షలు, ఆశలను చట్టసభల్లో వినిపించేలా ప్రతి జనసేన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ చర్చల్లో పాల్గొనాలని పవన్ కల్యాణ్ తేల్చిచెప్పారు.
సందేహాలుంటే సీనియర్లను అడగండి: శాసనసభ సంప్రదాయాలు, మర్యాద కాపాడుతూ హుందాగా ముందుకు వెళ్దామన్నారు. సమస్యలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకుని చర్చల్లో పాల్గొనాలని చెప్పారు. ప్రజాప్రయోజన అంశాల్ని జీరో అవర్, ప్రశ్నోత్తరాల సమయాల్లో లేవనెత్తడం సహా ఇతర అంశాలపై జరిగే చర్చల్లోనూ చురుగ్గా పాల్గొనాలని సూచించారు. సందేహాలుంటే సీనియర్లు నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ, మండలి బుద్ధప్రసాద్, కందుల దుర్గేష్ల సలహాలు తీసుకోవాలని, సభలో నడుచుకోవాల్సిన విధానం, సమస్యలను సభ ముందుకు తీసుకురావాల్సిన పద్ధతిపైనా వారితో చర్చించాలన్నారు.
శాసనసభాపక్ష సభ్యులకు ప్రత్యేక విందు: జనసేన సభ్యులంతా బడ్జెట్ను అధ్యయనం చేయాలని, ప్రభుత్వ రాబడులు, ఖర్చులు, శాఖలవారీగా కేటాయింపులు, అప్పులు, ఇతరత్రా అంశాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు పవన్ సూచించారు. బడ్జెట్ పద్దులపై జరిగే చర్చల్లో పాల్గొనాలని చెప్పారు. సభ్యులు వారికి ఏయే శాఖలపై అవగాహన, ఆసక్తి ఉన్నాయో వాటి ఆధారంగా చర్చల్లో మాట్లాడాలన్నారు. నియోజకవర్గంలోని ప్రజాసమస్యలు తెలుసుకుని రాష్ట్రవ్యాప్తంగా ఆ తరహా సమస్యలు ఉంటే వాటన్నింటినీ క్రోడీకరించి మాట్లాడాలని సూచించారు. అప్పుడే ప్రతి సభ్యుడి గొంతు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ అర్థమవుతుందన్నారు. సమావేశం అనంతరం శాసనసభాపక్ష సభ్యులకు పవన్ కల్యాణ్ ప్రత్యేక విందు ఇచ్చారు.
24 అంశాలపై చర్చకు రె'ఢీ' అంటున్న కూటమి - అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి