Antarvedi Kalyanotsavam 2025 : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా గోదావరి సాగర సంగమ క్షేత్రం అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా సాగింది. సౌభాగ్య ప్రదాయిని శ్రీదేవి, భూదేవితో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వామి వారికి అంతర్వేది ఆలయ ప్రాంగణంలో శుక్రవారం రాత్రి 12:55 గంటలకు దివ్య పరిణయోత్సవం వైభవోపతంగా నిర్వహించారు మూడు గంటలపైగా వివాహ మహోత్సవ క్రతువును నిర్వహించగా అశేష భక్తజనం తిలకించి పులకించారు.
భక్తుల కొంగు బంగారం , గోదావరి జిల్లాల వాసుల ఆరాధ్య దైవం అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మాఘ మాసం శుక్లపక్షం దశమి వేళ మృగశిరా నక్షత్రయుక్త వృశ్ఛిక లగ్న శుభ ముహూర్త సమయంలో మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణలు, భక్తుల గోవిందనామస్మరణల మధ్య కల్యాణోత్సవం జరిగింది. ఆద్యంతం అద్వితీయంగా సాగిన ప్రతిఘట్టం భక్తజనులను పరమానందభరితుల్ని చేసింది.
స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను కంకణధారణ, పాణిగ్రహణం చేసిన అనంతరం మాంగల్యధారణను రమణీయంగా నిర్వహించారు. తలంబ్రాల ఘట్టం కనులపండువగా సాగింది. స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా శోభిల్లుతున్న ఉత్సవమూర్తులను భక్తులు దర్శించుకుని తరించారు. ప్రధానార్చకుడు పాణింగిపల్లి శ్రీనివాసకిరణ్, వేద పండితులు, అర్చకస్వాములు కల్యాణ క్రతువులోని ప్రతి ఘట్టాన్ని శాస్త్రోక్తంగా జరిపి అందులోని అంతరార్ధాన్ని భక్తులకు కమనీయంగా వివరించారు.