Champions Trophy 2025 India tour of Pakisthan : వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ఇండియా పాల్గొంటుందా? లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీ ప్రతిపాదిత షెడ్యూల్ను కూడా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి సమర్పించింది. భద్రతా, రవాణాపరమైన కారణాల దృష్ట్యా భారత జట్టు లాహోర్లోని గడాఫీ స్టేడియంలో ఆడేలా షెడ్యూల్ ఏర్పాటు చేశారు. కానీ పాకిస్థాన్కు వెళ్లి ఆడేందుకు టీమ్ఇండియా సుముఖంగా లేదు.
అయితే తాజాగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియాను పాకిస్థాన్కు పంపేలా బీసీసీఐని ఒప్పించే బాధ్యతను పీసీబీ ఐసీసీకి అప్పగించిందని తెలిసింది. రీసెంట్గా కొలంబోలో జరిగిన ఐసీసీ వార్షిక మీటింగ్లో ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన బడ్జెట్, షెడ్యూల్ను ఐసీసీకి సమర్పించినట్లు పీసీబీ వర్గాలు వెల్లడించాయి.
"ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ను ఫైనలైజ్ చేయడం ఇప్పుడు ఐసీసీ పరిధిలోని అంశం. డ్రాఫ్ట్ షెడ్యూల్లో టీమ్ఇండియా ఆడే అన్ని మ్యాచ్లను లాహోర్లోనే ఆడేలా రూపొందించారు. పన్ను విధివిధానాలు, వేదికల ఎంపిక, భారత్ జట్టుకు ఆతిథ్యం ఇవ్వడానికి పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి అనుమతికి సంబంధించిన వివరాలను పీసీబీ ఐసీసీకి సమర్పించింది అని" పీసీబీ వర్గాలు తెలిపాయి.