Players Ban From IPL Auction :2025 ఐపీఎల్ మెగా వేలానికి ముందు బీసీసీఐ కొందరు ప్లేయర్లకు షాక్ ఇవ్వనుంది. అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్ ఉన్న బౌలర్లపై కఠిన చర్యలు తీసుకోనుంది. ఈ క్రమంలో అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్ ఉన్న ప్లేయర్ల జాబితాను బీసీసీఐ తాజాగా విడుదల చేసింది. వీరిపై వేటు పడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ జాబితాలో ఉన్న వాళ్లందరూ మెగా వేలంలో ఉన్నవారే కావడం వల్ల ఇది క్రీడావర్గాల్లో హాట్టాపిక్గా మారింది.
వీరు బ్యాన్!
టీమ్ఇండియా క్రికెటర్లు మనీశ్ పాండే, సృజిత్ కృష్ణన్ దేశవాళీలలో కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ఆడుతున్నారు. అయితే వీరిద్దరి బౌలింగ్ యాక్షన్ అనుమానస్పదంగా ఉండడం వల్ల వీరిపై బీసీసీఐ నిషేధం విధించింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2025 మెగావేలానికి ముందు మరో ముగ్గురు ప్లేయర్లను బీసీసీఐ సందేహాస్పద జాబితాలో చేర్చడం గమనార్హం. యంగ్ ప్లేయర్ దీపక్ హుడా(రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్), సౌరభ్ దూబే (విదర్భ క్రికెట్ అసోసియేషన్), కేసీ కరియప్ప (మిజోరాం క్రికెట్ అసోసియేషన్)ను ఈ సందేహాస్పద జాబితాలో బీసీసీఐ చేర్చింది.
ఆ లిస్ట్ లోనే- కానీ!
దీపక్ హుడా, సౌరభ్ దూబే, కేసీ కరియప్ప అనుమానాస్పద బౌలర్ల జాబితాలోకి చేరినప్పటికీ, వీళ్లపై ప్రస్తుతానికి ఎలాంటి నిషేధం లేదు. కానీ, వీరిపై నిషేధం పడే ప్రమాదం మాత్రం ఉంది. స్పిన్ ఆల్రౌండర్ దీపక్ హుడా మెగా వేలంలో డిమాండ్ ఉన్న లోకల్ ఆటగాళ్లలో ఒకడు. హుడా తన కనీస ధర రూ.75 లక్షలుగా నిర్ణయించుకోగా, కరియప్ప, సౌరభ్ దూబే రూ.30 లక్షల బేస్ప్రైజ్తో వేలంలో ఉన్నారు. కానీ, వేలానికి ముందు వీళ్లు సందేహాస్పద జాబితాలో ఉండడం పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు.