Valmiki Jayanti 2024 :ఎందరో మహనీయులు జన్మించిన పుణ్యభూమి భరతభూమి. ఈ తరం వారు అలాంటి మహనీయుల జీవిత చరిత్రలను తెలుసుకోవడం ద్వారా స్ఫూర్తిని పొంది, వారి మార్గంలో పయనించడం ద్వారా అనుకున్న లక్ష్యాలను సునాయాసంగా సాధించగలుగుతారు. అలాంటి ఓ మహనీయుని జీవిత గాథను ఈ కథనంలో తెలుసుకుందాం.
వాల్మీకి జయంతి
హిందువుగా జన్మించిన ప్రతి ఒక్కరూ అనుసరించవలసిన ఆదర్శ కావ్యం రామాయణం. అలాంటి రామాయణాన్ని రచించినది వాల్మీకి మహర్షి. ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి శ్రీ వాల్మీకి జయంతి సందర్భంగా ఆ మహర్షి జీవిత విశేషాలు తెలుసుకుందాం.
వాల్మీకి జనన విశేషాలు
వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణంలోని నగర ఖండంలోని ముఖార తీర్థ సృష్టికి సంబంధించిన విభాగంలో వాల్మీకి ఓ బ్రాహ్మణుడిగా జన్మించాడని తెలుస్తోంది. మరో కథనం ప్రకారం వాల్మీకి అసలు పేరు రత్నాకరుడని, ఆయన బోయవాడని వేటాడి జీవించేవాడని తెలుస్తోంది. ఏది ఏమైనా వాల్మీకి జీవితం లోకానికే ఆదర్శం.
కరువు కాటకాలతో దొంగగా మారిన వాల్మీకి
ఒకానొక సమయంలో 12 సంవత్సరాల పాటు వర్షాలు కురియక తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలో రత్నాకరుడు భార్యాబిడ్డలను పోషించుకోవడానికి అడవి మార్గంలో ప్రయాణించే వారిని అటకాయించి దారికాచి దోచుకునేవాడు. ఒకసారి నారద మహర్షి అదే మార్గంలో ప్రయాణిస్తూ రత్నాకరుడికి తారసపడ్డాడు. అప్పుడు నారదుడు అతనిని సంస్కరించదలచి, నీవు చేసే ఈ పాపంలో నీ భార్యాబిడ్డలు పాలు పంచుకుంటారా? అని అడుగుతాడు. వెంటనే బోయవాడు ఇంటికి వెళ్లి తాను చేసే పాపంలో పాలు పంచుకుంటారా? అని అడుగుతాడు. అప్పుడు అతని భార్యా పిల్లలు మమ్మల్ని పోషించే భారం నీదే కాబట్టి నీవు ఎలా సంపాదించావో మాకు అనవసరం. నీ పాపంలో మాకు భాగం లేదని స్పష్టం చేస్తారు. వారి మాటలు వినగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన బోయవాడు అడవికి వెళ్లి నారదునికి ఇదే విషయం చెబుతాడు.