Ujjain Mangalnath Mandir Pooja :విభిన్న సంస్కృతులకు, సంప్రదాయాలకు పుట్టినిల్లు భారతదేశం. సకల దేవీ దేవతలకు, నవగ్రహాలకు భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. నవగ్రహాల్లోనూ ఒక్కో గ్రహానికి ఒక్కో ఆలయం కూడా ఉంది. అందులో ముఖ్యంగా ఎరుపు గ్రహంగా పిలిచే అంగారకుడికి ఎన్నో మందిరాలు ఉన్నప్పటికీ, ఉజ్జయినిలోని ఆలయం మాత్రం ఎంతో ప్రత్యేకమైనది.
అంగారకుని మాతృమూర్తి ఉజ్జయిని?
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆధ్యాత్మిక రాజధాని ఉజ్జయినిలో వెలసిన అంగారక ఆలయాన్ని మంగళనాథ్ మందిరమని అంటారు. మత్స్య పురాణం, స్కంద పురాణం ప్రకారం అంగారకుడు ఉజ్జయినీలోనే జన్మించాడని, అందుకే ఈ నగరాన్ని అంగారకుని మాతృమూర్తి అని కూడా అంటారని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ఆలయానికి సరిగ్గా పై భాగంలో ఆకాశంలో అంగారకుడు ఉన్నాడని భక్తులు విశ్వసిస్తారు.
ఆలయ చరిత్ర
స్కంద పురాణం ప్రకారం పూర్వం అంధకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. తన రక్తం నుంచి వందలాది రాక్షసులు పుడతారని ఈ రాక్షసునికి పరమ శివుని ద్వారా పొందిన వరం ఉండేది. వరగర్వంతో అందరినీ బాధిస్తున్న అంధకాసురుని సంహరించడానికి పరమశివుడు తానే స్వయంగా అంధకాసురుడితో యుద్ధం చేస్తాడు. ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో శివుడు చెమట ధారలుగా ప్రవహించింది. ఈ చెమట వేడి కారణంగా ఉజ్జయినిలో నేల రెండుగా విడిపోయి అంగారక గ్రహం పుట్టింది. భీకర యుద్ధం తర్వాత ఎట్టకేలకు శివుడు అసురుడిని సంహరించగా, శివుని చెమట ద్వారా వచ్చిన వేడినించి ఉద్భవించిన అంగారకుడు రాక్షసుడి రక్తపు చుక్కల నుంచి తిరిగి రాక్షసులు పుట్టకుండా ఆ చుక్కలను తానే స్వీకరిస్తాడు. అందుకే అంగారక గ్రహం అరుణ వర్ణంలో అంటే ఎరుపు రంగులో ఉంటుందని అంటారు. అంగారక గ్రహాన్ని అరుణ గ్రహం అని కూడా అంటారు.
శివుని రూపంలో పూజలందుకునే అంగారకుడు
అంగారకుడు శివుని చెమట నుంచి ఉద్భవించినందున శివ కుమారుడని, పరమ శివుని చెమట భూమిపై పడటం వలన వచ్చిన వేడి నుంచి ఉద్భవించినందున పృథ్వి కుమారుడు అంటే కుజుడని అంటారు. అందుకే ఉజ్జయిని మంగళనాథ్ ఆలయంలో అంగారకుడిని శివుడి రూపంలో పూజిస్తారు. ఈ దేవాలయంలో అంగారకుడిని ఆరాధించడం వల్ల జాతకంలో కుజ దోషాలుంటే పోతాయని భక్తుల విశ్వాసం.