Ramakrishna Theertham :తిరుమల గిరుల్లో ఎన్నో పుణ్య తీర్థాలు, మరెన్నో పవిత్ర ప్రదేశాలు. తిరుమలలోని పవిత్ర తీర్థాలకు ఏటా ముక్కోటి జరుగుతుంది. మాఘ పౌర్ణమి రోజు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి జరుగనున్న సందర్భంగా ఆ విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఎప్పుడు?
తిరుమల శేషాచల అడవుల్లోని పుణ్య తీర్థాల్లో శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఒకటి. ఏటా మాఘ మాసంలో పౌర్ణమి నాడు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. ఫిబ్రవరి 12వ తేదీ మాఘ పౌర్ణమి సందర్భంగా శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి విశిష్టతను తెలుసుకుందాం.
తిరుమలలో పుణ్య తీర్థాలు
పురాణాల ప్రకారం తిరుమలలో 3 కోట్ల 50 లక్షల పుణ్యతీర్థాలు ఉన్నాయి. ఈ పుణ్య తీర్థాలలో, సప్తగిరులలో వెలసి ఉన్న సప్త తీర్థాలు ప్రముఖమైనవి. వీటిలో స్వామి పుష్కరిణీ తీర్థం, కూమారధార తీర్థం, తుంబురు తీర్థం, శ్రీరామకృష్ణ తీర్థం, ఆకాశగంగ తీర్థం, పాపవినాశన తీర్థం, పాండవ తీర్థం అత్యంత ప్రసిద్ధమైనవి. ఈ తీర్థాలలో స్నానమాచరిస్తే భక్తులు పరమపావనులై ముక్తి పొందుతారని నమ్మకం.
శ్రీరామకృష్ణ తీర్థం ఎక్కడ ఉంది
శ్రీరామకృష్ణ తీర్థం తిరుమల శ్రీవారి ఆలయానికి 6 మైళ్ల దూరంలో ఉంది. పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమి నాడు ఈ తీర్థ ముక్కోటిని ఆలయ ఆర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
పౌరాణిక గాథ
వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం పూర్వకాలంలో శ్రీరామకృష్ణుడు అనే మహర్షి వేంకటాద్రిపై తపస్సు చేసి, తన తపస్సు కోసం, ప్రతినిత్యం పవిత్ర స్నానం చేయడం కోసం రామకృష్ణ తీర్థాన్ని రూపొందించుకున్నారు. ఆ మహర్షి ఈ తీర్థ తీరంలో నివసిస్తూ స్నానపానాదులు చేస్తూ, శ్రీమహావిష్ణువు కోసం కఠోర తపస్సు చేశారంట! ఆయన తపస్సుకు మెచ్చిన విష్ణువు సాక్షాత్కారంతో ఆయన ముక్తి పొందినట్లుగా స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది.