తెలంగాణ

telangana

తిరుచానూరు ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం - పవిత్రోత్సవాలకు మందు ఎందుకిలా చేస్తారంటే? - Tiruchanur Pavitrotsavam

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2024, 9:57 AM IST

Tiruchanur Pavitrotsavam : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్​ 16వ తేదీ నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అసలు పవిత్రోత్సవాలు ఎందుకు జరుపుతారు? ఎన్ని రోజుల పాటు జరగనుందనే ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

Tiruchanur Pavitrotsavam
Tiruchanur Pavitrotsavam (Getty Images)

Tiruchanur Pavitrotsavam : వ్యాస మహర్షి రచించిన బ్రహ్మాండ పురాణం ప్రకారం ఏడాదిలో అమ్మవారి ఆల‌యంలో భక్తుల వల్ల, లేకుంటే సిబ్బంది వల్ల గానీ తెలిసీ తెలియక జరిగే దోషాల కారణంగా ఆలయ పవిత్రతకు ఎటువంటి లోపం రానీయకుండా నివారించేందుకు చేస్తారు. సంవత్సరంలో మూడు రోజుల పాటు ఈ పవిత్రోత్సవాలను నిర్వహించడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. ఇందులో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

పవిత్రోత్సవాలు ఎప్పుడంటే?
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరగనున్న పవిత్రోత్సవాలు సెప్టెంబర్ 15వ తేదీన అంకురార్పణతో ప్రారంభం అవుతాయి. సెప్టెంబర్ 16న పవిత్ర ప్రతిష్ట, సెప్టెంబర్ 17న పవిత్ర సమర్పణ, సెప్టెంబర్ 18న పూర్ణాహుతి కార్యక్రమాలు జరగనున్నాయి. అయితే అంతకు ముందుగానే కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కూడా జరుగుతుంది.

సెప్టెంబరు 10న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలు పురస్కరించుకొని సెప్టెంబర్ 10వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది.

కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం అంటే?
అమ్మవారి ఆలయంలో పవిత్రతకు తెలిసీ తెలియక ఏదైనా భంగం కలిగుంటే శుద్ధి చేసే కార్యక్రమాన్ని కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం అంటారు. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, శుద్ధి నిర్వహిస్తారు. ఆ తర్వాత ఉదయం 7 నుంచి 9.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు.

ఆర్జిత సేవలు రద్దు
పవిత్రోత్సవాలు సందర్భంగా ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, అష్టదళ పాద పద్మారాధన వంటి పలు ఆర్జిత సేవలు టీటీడీ రద్దు చేసింది.

పవిత్రోత్సవాలలో అమ్మవారి దర్శనం పరమ పవిత్రం
పవిత్రోత్సవాలు జరిగే సమయంలో శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతారు.

ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details