Thirunallar Shani Temple : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ ఉన్నట్లయితే చేసే పనిలో ఆటంకాలు, ఆర్థిక సమస్యలు, రుణబాధలు, అనారోగ్య సమస్యలు వంటి ఇబ్బందులు ఉంటాయి. ఈ దోషాలు పోగొట్టుకోడానికి శనికి చేసే పూజలతో పాటు ఒక్కసారి ఈ శని దేవాలయాన్ని సందర్శిస్తే ఎలాంటి శని దోషాలైనా తొలగిపోతాయని విశ్వాసం. ఇంతకూ ఈ దేవాలయం ఎక్కడుంది? ఆ ఆలయ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
తిరునల్లార్ శని దేవాలయం ఎక్కడుంది?
తిరునల్లార్ శని దేవాలయం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూర్ జిల్లాలో ఉంది. రెండు నదుల మధ్య ఉన్న ఈ ఆలయంలో శనితో పాటు శివుడిని పూజిస్తే శని దోషం తొలగిపోతుందని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు శని దేవుని స్థానం మారినప్పుడు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఏలినాటి శని బాధలతో ఇబ్బంది పడేవారు ఒక్కసారి ఈ ఆలయాన్ని సందర్శిస్తే శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుందని అంటారు.
దర్భారణ్యేశ్వర స్వామి క్షేత్రం
అతి ప్రాచీన చరిత్ర కలిగిన తిరునల్లార్ శని దేవాలయాన్ని దర్భారణ్యేశ్వర స్వామి క్షేత్రం అని కూడా అంటారు. సాక్షాత్తు నల మహారాజు దర్శించుకున్న ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలోని 'నల' పుష్కరిణిలో స్నానం చేస్తే శని బాధలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయాన్ని తొలుత చోళులు అభివృద్ధి చేయగా తర్వాతి కాలంలో ఎందరో రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారని ఆలయంలోని శాసనాల ద్వారా మనకు తెలుస్తుంది.
శివపార్వతుల ఆలయం
ఈ క్షేత్రంలో పరమ శివుడు దర్భారణ్యేశ్వరస్వామిగా, పార్వతి దేవి ప్రాణేశ్వరిగా పూజలందుకుంటున్నారు. అయితే ఈ ఆలయంలో ఓ నియమం ఉంది. ముందుగా శని దర్శనం చేసుకున్న తర్వాతే శివపార్వతుల దర్శనం చేయాలి. ఏడాది మొత్తం విశేష పూజలతో, భక్తుల తాకిడితో కళకళలాడే ఈ మహిమాన్వితమైన ఆలయ విశేషాలను చూద్దాం.
ఆలయ స్థల పురాణం
ఈ ఆలయ నిర్మాణం వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. ఈ ప్రాంతాన్ని పరిపాలించే రాజు ఓ గొల్లవానికి ప్రతిరోజూ ఈ ఆలయంలో పాలు పోయమని ఆఙ్ఞాపించాడంట! శివభక్తుడైన ఆ గొల్లవాడు కూడా రాజుగారి ఆజ్ఞ మేరకు దేవాలయంలో పాలు పోస్తుండేవాడు. అయితే కొన్ని రోజులకు ఆలయ అధికారి ఒకరు గొల్లవానితో శివాలయంలో పోసే పాలు తన ఇంట్లో పోయమని ఈ విషయం రాజుకు చెప్పవద్దని హెచ్చరించాడంట!
ఆలయ అధికారి ఇంటికి తరలి పోయిన పాలు
ఆలయ అధికారి చెప్పినట్లుగా ఆనాటి నుంచి గొల్లవాడు శివాలయంలో కాకుండా అధికారి ఇంట్లో పాలు పోయడం మొదలు పెట్టాడు. ఈ విషయాన్ని ఆలయ పూజారి రాజుగారి దృష్టికి తీసుకెళ్లాడు. రాజుగారు గొల్లవాని పిలిచి కారణం అడిగాడు. గొల్లవాడు భయపడి ఎంతకూ విషయం చెప్పలేదు. దీనితో రాజు ఆగ్రహించి గొల్లవానికి మరణశిక్ష విధించాడు. దాంతో గొల్లవాడు శివుని వేడుకోగా శివుడు అనుగ్రహించి ఆ భక్తుని కరుణించాడని కథనం. ఈ క్రమంలోనే శివుని ఆలయంలో బలిపీఠం కొంచెం పక్కకు జరిగిందని అంటారు. ఇప్పటికి అది అలాగే ఉంటూ ఆనాటి సంఘటనకు సజీవ సాక్ష్యంగా నిలిచింది.
నల పుష్కరిణి మహత్యం
విదర్భ చక్రవర్తి భీముని కుమార్తె దమయంతి అపురూపమైన అందగత్తె! ఆమెను వివాహం చేసుకోవాలని ఎందరో దేవతలు, రాజులు ప్రయత్నించగా దమయంతి మాత్రం నల మహారాజును వివాహం చేసుకుంది. అది గిట్టని దేవతలు ఆ జంటను ఇబ్బందులు పెట్టమని శనిదేవుని వేడుకున్నారంట!