Sri Ishta Kameswari Puja :శివమహాపురాణం ప్రకారం మన దేశంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అందులో రెండవదిగా భాసిల్లుతున్న శ్రీశైలం క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉంది. శ్రీశైలంలో పరమ పవిత్రమైన మల్లన్న, భ్రమరాంబికల దర్శనమే కాకుండా నల్లమల అడవుల్లో మనకు తెలియని ఎన్నో దేవాలయాలు దాగి ఉన్నాయి. స్థానికుల కథనం ప్రకారం, దాదాపు 500 శివలింగాలు నల్లమల అడవుల్లో ఉన్నాయంటే వినడానికే ఆశ్చర్యంగా ఉంటుంది. అయితే నల్లమల అడవుల్లో కొన్ని ఆలయాలకు చేరుకోవడం దుర్లభమే కాదు అత్యంత సాహసమైన విషయం. అందుకే ఇక్కడి అతి ప్రాచీన శివలింగాల గురించి బయటి ప్రపంచానికి తెలియదు. కానీ ఇప్పుడిప్పుడు స్థానికుల సహాయంతో కొందరు సాహసికులు కొన్నింటిని దర్శనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ఆలయమే నల్లమల అడవుల్లో ఉన్న ఇష్ట కామేశ్వరి ఆలయం.
దేశంలో ఎక్కడా లేని అరుదైన ఆలయం
నల్లమల అడవుల్లో ఉన్న ఇష్ట కామేశ్వరి ఆలయం గురించి అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. మహిమాన్వితమైన ఇష్టకామేశ్వరి దేవి పేరుతో శ్రీశైల క్షేత్రంలో తప్ప దేశంలో మరెక్కడా ఇలాంటి ఆలయం కనిపించదు.
అందరికీ దొరకని అపురూప దర్శనం
శ్రీశైలంలో జ్యోతిర్లింగ దర్శనం కోసం వెళ్లే అందరికీ ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శన భాగ్యం దొరకదు. ఎంతో అదృష్టం ఉంటే తప్ప అమ్మవారి దర్శనం చేసుకోలేమని భక్తుల విశ్వాసం.
కోరిన కోర్కెలు తీర్చే తల్లి ఇష్టకామేశ్వరి దేవి
అతి కొద్ది మంది మాత్రమే ఇష్ట కామేశ్వరి అమ్మవారి గురించి తెలుసుకొని అమ్మవారి దర్శనానికి వెళ్తారు. అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఎలాంటి కోరికలు అయినా నెరవేరుతాయని నమ్మకం ఇక్కడ ఎంతో బలంగా ఉంది. అయితే అందుకోసం మనం ఒక పని చేయాలి. మన మనసులో కోరికను అమ్మవారికి చెప్పి అమ్మవారి నుదుటన బొట్టు పెట్టాలి.
ఒళ్ళు జలదరించే మహాత్యం
కోరిక చెప్పుకొని అమ్మవారి నుదుటన బొట్టు పెట్టే భక్తులు ఒళ్ళు జలదరించే అనుభూతిని పొందుతారు. మన చేతితో అమ్మవారి నుదురు తాకగానే నిజంగా మనిషి నుదురులాగా మెత్తగా తగిలి అనిర్వచనీయమైన అనుభూతితో ఒళ్ళు జలదరిస్తుంది. ఈ మహత్యాన్ని చూసిన భక్తులు ఆశ్చర్యానందాలతో తన్మయత్వానికి లోనవుతారు.
నాడు సిద్ధులు నేడు సామాన్య ప్రజలు కూడా!
ఒకప్పుడు ఇష్ట కామేశ్వరి అమ్మవారి ఆలయం చేరుకోడానికి సరైన దారి కూడా ఉండేది కాదు. కొండల మీద జీపు ప్రయాణం అత్యంత ప్రమాదంతో కూడిన సాహసం. అందుకే పూర్వం అడవుల్లోని సిద్ధులచే అమ్మవారు పూజలందుకునేది. ఇప్పుడు కొంత మెరుగైన రవాణా సౌకార్యాలు అందుబాటులోకి వచ్చాక సామాన్య భక్తులు కూడా ఇష్ట కామేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్లి తమ కోరికలు అమ్మవారికి నివేదించి ఆ అమ్మ అనుగ్రహాన్ని పొందుతున్నారు.