తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

మౌని అమావాస్య రోజే మూడో రాజ స్నానం- కుంభమేళాలో ఈ దానాలు చేస్తే విశేష ఫలితాలు ఖాయం! - MAHA KUMBH MELA 2025

కుంభమేళాలో మూడో రాజ స్నానం ఎప్పుడు ఆచరించాలి? శాస్త్రోక్తంగా రాజ స్నానం ఎలా ఆచారించాలో మీ కోసం!

Kumbh Mela Third Raja Snanam
Kumbh Mela Third Raja Snanam (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 12, 2025, 2:48 AM IST

Kumbh Mela Third Raja Snanam :భారతదేశంలో జరిగే అతిపెద్ద ఆధాత్మిక ఉత్సవం మహా కుంభమేళా. ఈ మేళాలో అత్యంత ముఖ్యమైనదిగా భావించే మూడవ రాజ స్నానం ఎప్పుడు ఆచరించాలి, శాస్త్రోక్తంగా స్నానం చేసే విధి విధానాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

మూడవ రాజ స్నానం ఎప్పుడు?
ప్రయాగ్​రాజ్​లో దాదాపు 45 రోజుల పాటు జరిగే మహా కుంభ మేళాలో మొత్తం ఆరు రాజ స్నానాలు జరగనుండగా, అతి ముఖ్యమైన మూడవ రాజ స్నానం మౌని అమావాస్య రోజు చేయనున్నారు. మౌని అమావాస్య రోజు చేసే రాజ స్నానం మహా కుంభ మేళాలో అతి పెద్ద స్నానంగా భావిస్తారు. ఈ స్నానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

మౌని అమావాస్య ఎప్పుడు
జనవరి 29న పుష్య బహుళ అమావాస్యను మౌని అమావాస్యగా జరుపుకుంటారు. ఈ రోజు చేసే నదీ స్నానం, దానాలకు విశిష్ట స్థానం ఉంది. ఈ రాజ స్నానం చేసే శుభ సమయం బ్రహ్మ ముహూర్తం సాయంత్రం 5.25 నుంచి ప్రారంభమవుతుంది. ఈ శుభ సమయం సాయంత్రం 6:18 గంటల వరకు ఉంటుంది.

మౌని అమావాస్య విశిష్టత
మౌని అమావాస్యనే చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు. పూర్వీకులకు మోక్షాన్ని ఇచే ఈ అమావాస్య రోజున చేసే నదీ స్నానానికి విశిష్ట స్థానం ఉంది. అందునా మహా కుంభమేళాలో చేసే మూడవ రాజస్నానంగా మౌని అమావాస్య స్నానానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది.

అరుదైన కలయిక
హిందూ మత విశ్వాసాల ప్రకారం మౌని అమావాస్య రోజున చేసే నదీస్నానం, శ్రాద్ధం వంటి కర్మలతో పూర్వీకుల అనుగ్రహంతో పితృ దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. వాస్తవానికి ఏడాదికి 12 అమావాస్యలు ఉంటాయి. పుష్య బహుళ అమావాస్య చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. అందునా మహా కుంభ మేళా, మౌని అమావాస్యల కలయిక అత్యంత ఫలవంతమైనదిగా జ్యోతిష్య శాస్త్ర పండితులు, ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.

శాస్త్రోక్తంగా రాజ స్నానం చేయాల్సిన విధి
మహా కుంభ మేళాలో రాజ స్నానం చేసే వారు ముందుగా నదీమతల్లికి నమస్కరించుకుని నది ఒడ్డు నుంచి కొంత మట్టిని సేకరించి నదికి నమస్కరిస్తూ నదిలోకి ప్రవేశించాలి. సేకరించిన మట్టిని నదిలో కలపాలి. భక్తి శ్రద్ధలతో ముక్కు మూసుకొని మూడు సార్లు నదిలో మునగాలి. దోసిలితో నీరు తీసుకొని తూర్పు తిరిగి సూర్యునికి అర్ధ్యం ఇవ్వాలి. తరువాత బయటకు వచ్చి నదిలోకి పసుపు కుంకుమ, పువ్వులు సమర్పించాలి. అరటి దొన్నెలో ఉంచిన దీపాలు నదిలో వదిలి నమస్కరించుకోవాలి. ఈ విధంగా శాస్త్రోక్తంగా నదీస్నానం పూర్తి చేసిన తరువాత నది తీరంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం వల్ల పితృదేవతలు సంతోషించి వంశాభివృద్ధి కలుగుతుంది.

ఈ దానాలు అత్యంత శ్రేష్టం
మౌని అమావాస్య రోజు మహాకుంభమేళాలో మూడో రాజ స్నానం చేసిన తర్వాత చేసే దానాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు చేసే అన్నదానం, వస్త్రదానం, గోదానం విశేషమైన ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రం చెబుతోంది. రానున్న మహా కుంభమేళా లో వీలైతే మనం కూడా పాల్గొని రాజ స్నానం చేద్దాం.తరిద్దాం.

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

పుష్య పౌర్ణమి నుంచి మహాకుంభ మేళా- రాజస్నానం ఎప్పుడు చేయాలి? రూల్స్ ఏమైనా ఉన్నాయా?

మహా కుంభమేళాలో రెండో రాజ స్నానం ఎప్పుడు? ఎలా ఆచరించాలి?

ABOUT THE AUTHOR

...view details