తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

సకల మనోభీష్టాలను నెరవేర్చే 'భౌమ ప్రదోష' వ్రతం- ఎలా చేసుకోవాలంటే?

భౌమ ప్రదోష వ్రతం విశిష్టత- పూజా విధి, శుభసమయం సహా పూర్తి వివరాలు ఇలా!

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

Bhauma Pradosh Vrat 2024
Bhauma Pradosh Vrat 2024 (ETV Bharat)

Bhaum Pradosh Vrat Vidhi In Telugu : హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం శివారాధనకు ప్రదోష సమయం అత్యంత పవిత్రమైనది. ప్రదోష సమయం ఉన్న రోజు శివుని ఆరాధన అత్యంత పవిత్రమైనదిగా చెబుతారు. ఈ సందర్భంగా అసలు ప్రదోషం అంటే ఏమిటి? అందులో భౌమ ప్రదోష విశిష్టత ఏమిటి? ప్రదోష వ్రతాన్ని ఆచరించే విధానం ఏమిటి? అనే ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

ప్రదోషం అంటే ఏమిటి? భౌమ ప్రదోషం అంటే ఏమిటి?
శివపూజలో ప్రదోష కాలానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. సూర్యాస్తమయం తర్వాత 2 గంటల 24 నిమిషాలు ప్రదోష కాలంగా పేర్కొంటారు. ప్రదోషం వచ్చే రోజు, తిథిని బట్టి రకరకాల పేర్లు ఉన్నాయి. ప్రతి రోజూ వచ్చే ప్రదోషాన్ని నిత్య ప్రదోషం అనీ, త్రయోదశి రోజు వచ్చే ప్రదోషాన్ని మహాప్రదోషం అని అంటారు. ప్రదోష వ్రతాలను త్రయోదశి తిథిలో శుక్ల పక్ష త్రయోదశి, కృష్ణ పక్ష త్రయోదశి రెండింటిలోనూ పాటిస్తారు.

భౌమ ప్రదోషం ఎప్పుడు?
అక్టోబర్ 15వ తేదీ ఆశ్వయుజ శుద్ధ త్రయోదశి మంగళవారం కలిసి వచ్చినందున ఆ రోజును భౌమ ప్రదోషంగా పాటించాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. తెలుగు పంచాంగం ప్రకారం మంగళవారాన్ని భౌమ వారమని కూడా అంటారు. అందుకే మంగళవారం వచ్చే ప్రదోషాన్ని భౌమ ప్రదోషమని అంటారు.

భౌమ ప్రదోష పూజకు శుభసమయం
ఏ రోజైతే త్రయోదశి తిధి సూర్యాస్తమయం తరువాత కనీసం 2.30 గంటల సమయం పాటు ఉంటుందో ఆ సమయాన్ని ప్రదోష సమయంగా భావించాలి. అందుకే ప్రదోష పూజను సాయంకాలం 5 గంటల నుంచి 7 గంటల లోపు చేసుకోవాలి.

భౌమ ప్రదోషం రోజు ఏ దేవుని పూజించాలి?
వ్యాస మహర్షి రచించిన శివ మహా పురాణం ప్రకారం భౌమ ప్రదోషం రోజు శివ పార్వతులను పూజించడం వల్ల మన మనోభీష్టాలు నెరవేరతాయని విశ్వాసం. పరమేశ్వరుని పూజకు విశిష్టమైన ప్రదోష వ్రతం రోజున ఆది దంపతులైన శివపార్వతులను పూజిస్తే సుఖసంతోషాలతో జీవిస్తారని విశ్వాసం. భౌమ ప్రదోషం రోజున చేసే శివ పూజలకు కోటి రెట్ల అధిక ఫలం ఉంటుందని శాస్త్ర వచనం.

ప్రదోష పూజా విధి
భౌమ ప్రదోషవ్రతం చేసుకునే వారు ఆ రోజు సూర్యోదయంతోనే నిద్రలేచి, శుచియై శివ పార్వతులని మల్లెలతో పూజించాలి. శక్తి ఉన్నవాళ్లు ఉపవాసం ఉంటే చాలా మంచిది. సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో సంధ్యా దీపం వెలిగించి నమస్కరించుకోవాలి. శివాష్టకం పఠించాలి.

శివాలయంలో పూజలు ఇలా!
సంధ్యాసమయంలో శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించి, అభిషేకం, అర్చనలు జరిపించుకొని కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకోవాలి. బిల్వ పత్రాలు, ఉమ్మెత్త పూలు, పండ్లు, పెరుగు, తేనె, శమీ ఆకులు వంటివి శివునికి సమర్పించాలి. ప్రదోష వ్రతం కథ చదువుకోవడం లేదా వినడం చేయాలి. ఆ తర్వాత శివునికి భక్తిశ్రద్ధలతో హారతి ఇవ్వాలి. చివరగా "ఓం నమః శివాయ" అనే పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఇంటికి తిరిగి వచ్చాక ఉపవాసాన్ని విరమించవచ్చు.

ఈ దానాలు శ్రేష్టం
భౌమ ప్రదోషవ్రతం రోజు శివాలయంలో అన్నదానం చేస్తే మంచిది. ఇంకా వస్త్ర దానం, ఛత్ర దానం చేస్తే మంచిది. ఆలయంలో బ్రాహ్మణులకు ఎర్రని కందులు దానం ఇస్తే మంచిది.

ఇవి నిషిద్ధం
భౌమ ప్రదోషవ్రతం చేసుకునే వారు మాంసాహారం, మద్యం సేవించడం నిషిద్ధం. నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. అలాగే ప్రదోష వ్రతం రోజు శివలింగానికి తులసి, కొబ్బరి నీళ్లు, కుంకుమ సమర్పించకూడదు. ఉపవాసం చేసేవారు భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా పూజ చేయాలి. రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. చిత్తశుద్ధితో మనసు మొత్తం శివుని మీద లగ్నం చేసి పూజిస్తేనే సత్ఫలితాలు ఉంటాయి.

ప్రదోష వ్రత కథ
పూర్వం ఒక నగరంలో బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమెకి భర్త చనిపోవడం వల్ల తన స్వశక్తితో కష్టపడి కొడుకులను పోషించుకుంటూ జీవనం సాగించేది. ఒకరోజు బయటకి వెళ్ళి తిరిగి వస్తుండగా ఆ బ్రాహ్మణ స్త్రీకి గాయపడిన స్థితిలో ఉన్న ఒక యువకుడు కనిపిస్తాడు. ఆమె దయతో అతనిని ఇంటికి తీసుకొచ్చి సపర్యలు చేసింది. తర్వాత ఆ కుర్రాడు విదర్భ రాకుమారుడని తెలుసుకుంటుంది. శత్రు సైనికులు అతని రాజ్యం మీద దాడి చేసి, ఆ యువకుని తండ్రిని బందీగా చేసుకుని రాజ్యాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారని తెలుస్తుంది.

రాకుమారుడు బ్రాహ్మణ స్త్రీ కుమారులతో కలిసి అక్కడే నివసిస్తూ ఉన్నాడు. ఒకరోజు అన్షుమతి అనే గంధర్వ కుమారి యువరాజుని చూసి ముగ్ధురాలు అవుతుంది. మరుసటి రోజు అన్షుమతి తన తల్లిదండ్రులతో కలిసి యువరాజుని కలుస్తుంది. కొన్ని రోజులకు శివుడు అన్షుమతి తల్లిదండ్రులకు కలలో కనిపించి వారి పెళ్లి చేయాలని ఆదేశిస్తాడు.

ప్రదోష వ్రత ప్రభావం
బ్రాహ్మణ స్త్రీ శివుడి పరమ భక్తురాలు. ప్రదోష వ్రతం తప్పనిసరిగా పాటిస్తూ వచ్చేది. ఆమె ప్రదోష వ్రత ఫలితం వల్ల అన్షుమతి తండ్రి అయిన గంధర్వ రాజు తన సైన్యంతో కలిసి యువరాజు రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న విదర్భ మీద దాడి చేసి విజయం సాధిస్తాడు. శత్రువులని తరిమేసి యువరాజు తండ్రిని కూడా బంధీల నుంచి విముక్తుడిని చేస్తాడు. అందుకే ప్రదోష వ్రతం నాడు ఉపవాసం ఉండి శివుడిని ఆరాధిస్తే భక్తుల కోరికలు తప్పకుండా నెరవేరతాయని నమ్ముతారు. యువరాజు ఆ బ్రాహ్మణ స్త్రీ ఆశ్రయాన్ని పొందిన తర్వాతనే తన కష్టాల నుంచి విముక్తి పొంది తన తండ్రిని కూడా శత్రు రాజుల నుంచి విడిపిస్తాడు. అందుకే ప్రదోష వ్రతానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. అక్టోబర్ 15వ తేదీ రానున్న భౌమ ప్రదోషవ్రతం రోజు మనం కూడా ఆ శివపార్వతులను ఆరాధిద్దాం. మన మనోభీష్టాలను నెరవేర్చుకుందాం. ఓం నమః శివాయ

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details