ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విక్రమార్కుడిలా రఘురామ న్యాయపోరాటం- 'హత్యాయత్నం కేసు'పై నిందితుల్లో ఉలికిపాటు! - Raghurama Legal Fight On Jagan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 14, 2024, 8:37 AM IST

Raghurama Legal Fight On EX CM Jagan : మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సీఐడీ తనపై చేసిన దాడిపై పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడుతున్నారు. మూడేళ్లుగా అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదలకుండా ఓ యుద్ధం కొనసాగిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మాజీ సీఎం జగన్ సహా పలువురు అధికారులపై హత్యాయత్నం కేసు నమోదయ్యేలా చేసి కొంత మేర విజయం సాధించారు. దీంతో అవాక్కయిన ఐపీఎస్ అధికారి సునీల్‌ కుమార్‌ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఓ పోస్ట్, తీవ్ర చర్చనీయాంశమైంది.

Raghurama Legal Fight On EX CM Jagan
Raghurama Legal Fight On EX CM Jagan (ETV Bharat)

Case Against Jagan with Raghurama Complaint :పోలీసు కస్టడీలో తనని చిత్రహింసలు పెట్టిన వారిపై మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చేస్తున్న పోరాటం, రాజకీయ, న్యాయ, పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా గుంటూరులోని నగరపాలెం పోలీస్​స్టేషన్​లో అప్పటి సీఐడీ విభాగాధిపతి సునీల్‌ కుమార్‌, నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, మాజీ సీఎం జగన్‌, సీఐడీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌, గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రభావతిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్లపై కేసులు నమోదయ్యేలా చేశారు.

ఉలిక్కిపడిన సునీల్‌ కుమార్‌ :రఘురామ ఫిర్యాదు నేపథ్యంలోపీవీ సునీల్‌ కుమార్‌ ఉలిక్కి పడినట్లు తెలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ఆయన చేసిన పోస్టు అందుకు ఉదాహరణగా నిలుస్తోంది. సుప్రీంకోర్టులో మూడేళ్లు నడిచి, సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్​ఐఆర్​ వేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నానని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వాస్తవానికి ఈ కేసును సుప్రీంకోర్టు తిరస్కరించలేదు.

తన తండ్రిని కస్టడీలో హింసకు గురిచేసిన ఘటనపై రఘురామ తనయుడు భరత్‌ దాఖలు చేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా పిటిషన్‌ని ఉపసంహరించుకొని హైకోర్టును ఆశ్రయించేందుకు స్వేచ్ఛ కల్పించాలని భరత్ తరఫు న్యాయవాది కోరారు. దీనికి సమ్మతించిన జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం, హైకోర్టును ఆశ్రయించేందుకు వెసులుబాటు కల్పించింది. అంతే తప్ప పిటిషన్‌ని తిరస్కరించలేదు. సునీల్‌ కుమార్‌ మాత్రం న్యాయస్థానం ఉత్తర్వులకు వక్రభాష్యం చెబుతున్నారు.

రాజద్రోహం కేసు - హైదరాబాద్‌లో అరెస్ట్ :వైఎస్సార్సీపీ హయాంలో అప్పటి సీఎం జగన్‌ తీసుకున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలపై గళమెత్తిన రఘురామపై సీఐడీ పోలీసులు 2021 మేలో రాజద్రోహం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. హైదరాబాద్‌లో ఉన్న ఆయన్ను మే 14న బలవంతంగా అదుపులోకి తీసుకుని గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చి ఆ రాత్రి చిత్రహింసకు గురి చేశారు. లాఠీ, బెల్టుతో దారుణంగా కొట్టారు. బెయిల్‌ కోసం ఆ రాత్రి అత్యవసరంగా హైకోర్టులో హౌస్‌మోషన్‌ విధానంలో పిటిషన్‌ వేశారు.

15న విచారణ జరిపిన హైకోర్టు బెయిల్‌ కోసం సెషన్స్‌ కోర్టును ఆశ్రయించాలని సూచించి పిటిషన్‌ని తోసిపుచ్చింది. మేజిస్ట్రేట్‌ ముందు ఎంపీని హాజరు పరిచేందుకు వెసులుబాటు కల్పించింది. మే 15న గుంటూరులోని ఆరో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో సీఐడీ అధికారులు రఘురామని హాజరుపరిచారు. తనని రబ్బరు బెల్టు, లాఠీలతో కొట్టారని ఆయన న్యాయాధికారి దృష్టికి తీసుకెళ్లారు.

ఒక ఎంపీని కొట్టడమేంటి : మరోవైపు రఘురామని కొట్టిన ఘటనపై ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టుకు లేఖ రాశారు. దీనిపై మే 15న ధర్మాసనం అత్యవసర విచారణ జరిపింది. ఒక ఎంపీని కొట్టడమేంటని విస్మయానికి గురైంది. రాష్ట్రంలో అసలేం జరుగుతోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. రఘురామ శరీరంపై ఉన్నవి పోలీసుల దెబ్బలేనని తేలితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. గాయాలను పరిశీలించి, నివేదిక ఇచ్చేందుకు ముగ్గురు వైద్యులతో మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేసింది.

సీఐడీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు : మే 16న హైకోర్టు విచారణ జరిపింది. రఘురామ ఒంటిపై గాయాలను గుంటూరు ప్రభుత్వాసుపత్రితో పాటు రమేశ్​ ఆసుపత్రిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని తెలిపింది. ఈ క్రమంలోనే గుంటూరు ఆరో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఇచ్చిన ఆదేశాలను, సీఐడీ పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రమేశ్​ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించకుండా జైలుకు తరలించడంపై మండిపడింది. ఆ ఆసుపత్రిలోనూ పరీక్షలు చేయించాలని ధర్మాసనం అధికారులను ఆదేశించింది.

మే 17న ఈ వ్యవహారంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆసుపత్రిలో ప్రత్యేక మెడికల్‌ బోర్డు, న్యాయాధికారి సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో ఆయణ్ని మే 17న గుంటూరు జైలు నుంచి సికింద్రాబాద్‌కు తరలించారు. మే 18న రఘురామ వైద్య పరీక్షల నివేదికను తెలంగాణ హైకోర్టు సుప్రీంకోర్టుకు సీల్డ్‌ కవర్‌లో అందించింది.

మే 19న విచారణ జరిపిన ఏపీ హైకోర్టు, రమేశ్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని, మేజిస్ట్రేట్‌ ఇచ్చిన ఉత్తర్వులను తక్షణం అమలు చేయాలని తెలిపింది. ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు విస్మరించారని, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఐడీ అదనపు డీజీ పీవీ సునీల్‌ కుమార్‌, మంగళగిరి సీఐడీ ఠాణా ఎస్​హెచ్​ఓపై సుమోటోగా, కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించింది. మరోవైపు వైద్య నివేదికను హైకోర్టుకు అందజేయడంలో జాప్యంపై వివరణ ఇవ్వాలని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌ ప్రభావతికి నోటీసులు జారీ చేసింది.

తన తండ్రిని కస్టడీలో హింసించిన సీఐడీ పోలీసులపై సీబీఐ విచారణ జరిపించాలని రఘురామకృష్ణరాజు కుమారుడు భరత్‌ 2021 మే 20న సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. మే 21న రఘురామకు సుప్రీంకోర్టు బెయిల్‌ ఇచ్చింది. అదే రోజు సికింద్రాబాద్‌ సైనికాసుపత్రి వైద్యులు నివేదికను సుప్రీంకోర్టుకు అందజేశారు. ఆయన ఎడమ కాలి వేలు విరిగింది. పాదాలు కందిపోయాయి. వాపు ఉందని నివేదికలో పేర్కొన్నారు. దాన్ని పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం ఎంపీపై పోలీసుల అనుచిత ప్రవర్తనను తోసిపుచ్చలేమని వ్యాఖ్యానించింది.

జాతీయ మానవ హక్కుల సంఘం ఛైర్మన్​కు రఘురామ ఫిర్యాదు : అక్రమ అరెస్ట్, కస్టోడియల్ టార్చర్‌పై సీబీఐతో విచారణ జరిపించాలని భరత్ వేసిన పిటిషన్‌పై మే 25న సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వం, సీబీఐకి నోటీసులిచ్చింది. దీనిపై కౌంటర్‌ వేయాలని ఆదేశించింది. మరోవైపు కస్టోడియల్ టార్చర్‌పై విచారణ జరిపించాలని జాతీయ మానవ హక్కుల సంఘం ఛైర్మన్‌కు 2021 మే 31న రఘురామ ఫిర్యాదు చేశారు.

గుండెలపై కూర్చొని - ఊపిరాడనివ్వకుండా చేసి :మరోవైపు తనపై దాడిని పార్లమెంట్‌పై దాడిగా పరిగణించాలని రఘురామకృష్ణరాజు అన్ని పార్టీల సహచర ఎంపీలకు జూన్ 3న లేఖలు రాశారు. గుండె శస్త్రచికిత్స చేయించుకున్న తనపై హత్యాయత్నం జరిగిన తీరును వారికి వివరించారు. సీఐడీ తనపై రాజద్రోహంతో పాటు వివిధ సెక్షన్ల కింద నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ 2022 జనవరి 17న హైకోర్టులో రఘురామ వ్యాజ్యం వేశారు. 2022 జనవరి 31న విచారణ జరిపిన హైకోర్టు సీఐడీ ఏడీజీ సునీల్‌ కుమార్‌తో పాటు రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి, సీఐడీ ఏడీజీ, మంగళగిరి సీఐడీ ఎస్​హెచ్ఓకు నోటీసులు జారీచేసింది. తన తండ్రిని హింసించడంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ భరత్‌ దాఖలు చేసిన పిటిషన్‌ని ఉపసంహరించుకొని హైకోర్టును ఆశ్రయించేందుకు 2022 డిసెంబర్‌ 14న సుప్రీంకోర్టు అనుమతిచ్చింది.

Raghurama CID Custody Allegations : అరెస్ట్, హింసించడంపై హైకోర్టు పర్యవేక్షణలో సీబీఐ లేదా సిట్‌తో దర్యాప్తు జరిపించాలని, 2023 జనవరి 24న హైకోర్టులో రఘురామ వ్యాజ్యం వేశారు. దర్యాప్తు ఫలితాన్ని బట్టి బాధ్యులపై క్రిమినల్‌ చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరారు. దీనిపై ఫిబ్రవరి 8న స్పందించిన హైకోర్టు సీబీఐ, కేంద్ర హోంశాఖ కార్యదర్శికి నోటీసులిచ్చింది. ఈ కేసులో 2023 మే 12న న్యాయస్థానం కీలక ఆదేశాలిచ్చింది. మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, ఆరుగురు పోలీసులు అధికారులు సునీల్‌ కుమార్‌, సునీల్‌ నాయక్‌, విజయ్‌పాల్‌, ఉమామహేశ్వరరావు, పసుపులేటి సుబ్బారావు, సుబ్రహ్మణ్యంకు సంబంధించి, 2021 మే 14 నుంచి 16 మధ్య కాల్‌డేటాను భద్రపరచాలని స్పష్టం చేసింది.

తన వైద్య పరీక్షల నివేదికలు, ఇతర ఫైళ్లను భద్రపరిచేలా ఆదేశాలివ్వాలంటూ, రఘురామ వేసిన పిటిషన్‌పై 2023 జూన్‌ 13న హైకోర్టు విచారణ జరిపింది. మెడికల్‌ బోర్డు నివేదికతోపాటు వివిధ విభాగాల వైద్యులు ఇచ్చిన నివేదికలను భద్రపరచాలని, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిని ధర్మాసనం ఆదేశించింది.

మాజీ సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసు నమోదు - case file on jagan

'అదే నాకు చివరి రోజు అవుతుందనుకున్నా'- నాటి భయానక అనుభవంపై రఘురామ - RRR Interview

ABOUT THE AUTHOR

...view details