తెలంగాణ

telangana

మార్పు అంటే 8 నెలల్లో రూ.50 వేల కోట్ల అప్పు చేయడమేనా? : కేటీఆర్ - KTR on Telangana Debt

By ETV Bharat Telangana Team

Published : Aug 14, 2024, 1:07 PM IST

KTR on Congress Govt Debt : మార్పు మార్పు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​, ఎనిమిది నెలల్లోనే రూ.50 వేల కోట్లు అప్పులు చేసిందని మాజీమంత్రి కేటీఆర్​ విమర్శించారు. కొత్త ప్రాజెక్టులు కూడా లేకుండా అంత అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందని నిలదీశారు. ఈ మేరకు ఆయన ఎక్స్​ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

KTR on Congress Govt Debt
KTR on Congress about Telangana Debt (ETV Bharat)

KTR on Congress about Telangana Debt : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే 50 వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకురావడంపై బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. మార్పు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఎనిమిది నెలల్లోనే రూ. 50 వేల కోట్ల అప్పు చేయటమేనా వాళ్లు చెప్పిన మార్పు అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఎక్స్​ వేదికగా ట్వీట్​ చేశారు. ఒక్క కొత్త ప్రాజెక్ట్ కూడా లేకుండా 50 వేల కోట్ల రూపాయలు అప్పు తేవాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు.

2023 నాటికి రాష్ట్రం రూ.5,900 కోట్ల మిగులు బడ్జెట్​తో ఉంటే ఎనిమిది నెలల కాలంలో దాన్ని రూ.50 వేల కోట్ల రుణానికి తీసుకెళ్లారని కేటీఆర్​ మండిపడ్డారు. రాష్ట్ర సంపద పెంచిన బీఆర్​ఎస్​పై అప్పులు చేశారంటూ తప్పుడు ప్రచారం చేశారని ఆక్షేపించారు. అపోహలు, అర్ధసత్యాలను ప్రచారం చేసి జనాన్ని తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాత్రం ఇప్పుడు అన్ని రికార్డులు బద్దలు కొడుతూ అప్పులు చేయటంలో టాప్​లో నిలుస్తోందని ఎద్దేవా చేశారు. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని కేటీఆర్ ప్రశ్నించారు.

కాంగ్రెస్ పదవీకాలం ముగిసే నాటికి ఐదు లక్షల కోట్ల అప్పు : ఇదే విధంగా అప్పులు చేసుకుంటూ పోతే కాంగ్రెస్ పదవీకాలం ముగిసే నాటికి నాలుగు నుంచి ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పుల భారం రాష్ట్రంపై పడడం ఖాయమని కేటీఆర్​ అన్నారు. అప్పుల విషయంలో బీఆర్​ఎస్​ను బద్నాం చేసి ప్రజలను మోసం చేయటంలో కాంగ్రెస్ విజయవంతమైందని వ్యాఖ్యానించారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని సరైన సమయంలో కాంగ్రెస్​కు కచ్చితంగా బుద్ధి చెబుతారని కేటీఆర్ పేర్కొన్నారు.

డ్రైనేజీ నిర్వహణ అధ్వాన్నంగా మారింది :మరోవైపు గ్రామాల్లో పారిశుద్ధ్యం, డ్రైనేజీ నిర్వహణ అధ్వాన్నంగా మారిందని ఎక్స్​ వేదికగా కేటీఆర్​ మండిపడ్డారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని అడిగిన మాజీ సర్పంచ్‌లపై నిర్బంధాలు పెడుతున్నారని ఆరోపించారు. రూ.500 కోట్ల నిధులను గ్రామ పంచాయతీలకు ఇంకెప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. మున్సిపాలిటీల్లో పెండింగ్ పనులకు మోక్షం లేదని, కొత్త వాటికి ప్రణాళిక లేదని ధ్వజమెత్తారు.

తెలంగాణలో అదానీ కంపెనీకి స్వాగతం పలకడం - కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం : కేటీఆర్ - KTR Comments on Congress

బాన్సువాడలో ఉప ఎన్నికలు ఖాయం - పోచారంను కచ్చితంగా ఓడిస్తాం : కేటీఆర్‌ - KTR On Pocharam Srinivas Reddy

ABOUT THE AUTHOR

...view details