Parvathamalai Temple : ముక్కోటి దేవతల్లో ముక్కంటికి ఉన్న ప్రత్యేకతే వేరు. భోళా శంకరుడిగా, ప్రళయకాల రుద్రుడిగా ఆయన రీతి అంతా భిన్నమే. మనసావాచా తనను స్మరిస్తే, శరణువేడింది రాక్షసుడైనా సరే వరాలిచ్చేస్తాడు. అలాంటి పరమేశ్వరుడి ప్రసన్నం కోసం భక్తులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఆరాధిస్తుంటారు. శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదంటూ ఆ శివయ్య ఆజ్ఞకోసం, ఆయన ప్రసన్నం కోసం నిత్య పూజలు చేస్తుంటారు.
అయితే, పరమశివుడిని పూజించేందుకు ఏ శివాలయానికి వెళ్లినా సరిపోతుంది. మనసులో భక్తి ఉంటే సరిపోతుంది. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే ఆలయానికి వెళ్లాలంటే మాత్రం కేవలం భక్తి చాలదు. గుండెల్లో దమ్ము, ధైర్యం ఉండాలి. అప్పుడే, ఆ శివాలయానికి వెళ్లడం సాధ్యమవుతుంది! అదేంటి అనుకుంటున్నారా? ఆ వివరాలు తెలియాలంటే "పర్వతమలై శివాలయం" గురించి తెలుసుకోవాల్సిందే.
తమిళనాడు రాష్ట్రంలోని, తిరువణ్ణామలై జిల్లాలో ఉందీ "పర్వతమలై శివాలయం". ఈ ఆలయం ఎత్తయిన కొండ మీద ఉంటుంది. ఇలాంటి కొండలు చాలా చూశాం, ఎక్కాం అనుకుంటున్నారేమో? ఇది అంతకు మించి అన్నట్టుగా ఉంటుంది. ఈ గుడికి చేరుకోవాలంటే ఏడు కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది. అప్పుడుగానీ ఆలయానికి చేరుకోలేరు. అంతేకాదు, ఇరుకైన మెట్లు, రాతి కొండల మీదుగా ఎంతో సాహసోపేతంగా ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. సముద్ర మట్టానికి సుమారు 5 వేల అడుగుల ఎత్తులో ఉంటుందీ కొండ.