తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Feb 17, 2024, 8:50 AM IST

Updated : Feb 17, 2024, 11:26 AM IST

ETV Bharat / international

ట్రంప్​నకు భారీ షాక్- ఫ్రాడ్​ కేసులో రూ.3వేల కోట్ల ఫైన్

Donald Trump Fine : అమెరికా అధ్యక్ష పీఠంపై రెండోసారి కూర్చోవాలని కలలు కంటున్న ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు కోర్టు కేసుల్లో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా సివిల్ ఫ్రాడ్ కేసులో న్యూయార్క్​ కోర్టు ట్రంప్​నకు 355 మిలియన్ డాలర్ల ( భారత కరెన్సీలో రూ. 2,946 కోట్లు) భారీ జరిమానా విధించింది.

Donald Trump Fine
Donald Trump Fine

Donald Trump Fine : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సివిల్ ఫ్రాడ్ కేసులో న్యూయార్క్​ కోర్టు ఆయనకు 355 మిలియన్ డాలర్ల ( భారత కరెన్సీలో రూ. 2,946 కోట్లు ) భారీ జరిమానా విధించింది. అలానే న్యూయార్క్​లోని కార్పొరేషన్​లో డైరెక్టర్​గా​ లేదా అధికారిగా పనిచేయకుండా మూడేళ్ల పాటు ట్రంప్​పై నిషేధం విధించింది.

ట్రంప్ తన నికర ఆస్తుల విలువలను ఎక్కువగా చూపించి బ్యాంకులను మోసం చేసి రుణాలు తీసుకున్నారన్నది ప్రధాన అభియోగం. మోసపూరితంగా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలతోనే తన ప్రాజెక్టులు పూర్తి చేశారని న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ ఆరోపించారు. ట్రంప్​కు కనీసం 370 మిలియన్ డాలర్లు జరిమానా విధించాలని న్యాయమూర్తిని కోరారు. రెండు నెలల క్రితమే ఈ కేసుపై న్యాయమూర్తి ఆర్థర్ ఎంగోరాన్ విచారణ చేపట్టి తీర్పును రిజర్వు చేసి ఉంచారు. శుక్రవారం ఈ తీర్పును వెల్లడించారు.

ఆస్తులు పెంచి మోసం!
ట్రంప్ తనకు ఉన్న ఆస్తుల విలువను పెంచేందుకు ఆర్థిక నివేదికలను తరచూ మార్చారని అటార్నీ జనరల్ ఆరోపించారు. ట్రంప్ టవర్ పెంట్ హౌస్ విస్తీర్ణాన్ని మూడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు చూపించారని పేర్కొన్నారు. ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో రిసార్ట్​ విలువను కూడా అధికంగా లెక్కగట్టారని చెప్పారు. ఇలా ట్రంప్ తన సంపదను 3.6 బిలియన్ డాలర్ల మేర పెంచుకున్నారని తెలిపారు.

ట్రంప్ వాదన ఇదే
ఈ కేసులో దాదాపుగా 40 మంది సాక్షుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. తన వాంగ్మూలం ఇచ్చిన ట్రంప్- ఈ కేసులో ఎలాంటి మోసం జరగలేదని, ఎవరూ నష్టపోలేదని చెప్పుకొచ్చారు. అయితే, ట్రంప్ వాదనలను న్యాయమూర్తి కొట్టిపారేశారు. విచారణ ప్రారంభించకముందే ట్రంప్ ఆర్థిక నివేదికలు మోసపూరితమైనవి జేమ్స్ నిరూపించారని న్యాయమూర్తి తెలిపారు. దీని తర్వాత ట్రంప్​కు చెందిన కొన్ని కంపెనీలను ఆయన నియంత్రణ నుంచి తొలగించి రద్దు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.

'అంతా మోసం, పక్షపాతం'
ఈ తీర్పుపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. 'ఈ నిర్ణయం అంతా మోసపూరితమైనది. న్యూయార్క్ రాష్ట్రం, అమెరికాలోని న్యాయవ్యవస్థ మొత్తం పక్షపాతంగా వ్యవహరిస్తోంది. పక్షపాతంగా, మోసపూరితంగా నడిచే న్యాయవాదులు, ప్రాసిక్యూటర్లతో న్యాయవ్యవస్థ నిండిపోయింది. న్యూయార్క్ సిటీ దారుణమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను సాయం చేశారు. ప్రస్తుతం జో బైడెన్​పై వస్తున్న వలసల ఆరోపణలను పక్కదారి పట్టించేందుకు ఇదంతా చేశారు. నన్ను పోటీ నుంచి ఎలాగైనా తప్పించడానికే చేయగలిగినదంతా చేస్తున్నారు' అని ట్రంప్ సోషల్​ మీడియాలో పోస్ట్ చేశారు.

అధ్యక్ష రేసులో ట్రంప్​ జోరు- రెండు ప్రైమరీ ఎన్నికల్లో విజయం

ట్రంప్​నకు మరో ఎదురుదెబ్బ- పరువు నష్టం కేసులో రూ.692కోట్లు ఫైన్​

Last Updated : Feb 17, 2024, 11:26 AM IST

ABOUT THE AUTHOR

...view details