ShahRukh Khan Move Out Of Mannat : బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ముంబయిలోని 'మన్నత్'లో నివసిస్తాడని చాలా మందికి తెలుసు. చాలా కాలంగా ఈ ఇంటిలో నివసిస్తున్న షారుఖ్ కుటుంబం ఇప్పుడు మరో ఇంటికి వెళ్లనుంది. ఎందుకని ఆశ్చర్యపోతున్నారా? ఎందుకుంటే ఐకానిక్ హోమ్ 'మన్నత్'లో రెనోవేషన్స్ చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్ 2025 మేలో ప్రారంభం కానుంది. కనీసం రెండేళ్ల పాటు పనులు జరుగుతాయని భావిస్తున్నారు.
హెరిటేజ్ క్లియరెన్స్ అవసరం :25 ఏళ్లుగా షారుక్ ఫ్యామిలీ 'మన్నత్'లో నివసిస్తోంది. ఈ బంగ్లాకు గ్రేడ్ III హెరిటేజ్ స్టేటస్ ఉంది. షారుఖ్ ఏదైనా మార్పులు చేయడానికి ముందు కోర్టు నుంచి ప్రత్యేక అనుమతి పొందవలసి ఉంటుంది. ఓ ప్రాంతం రూపానికి, గుర్తింపుకి కీలకమైన భవనాలకు 'గ్రేడ్ III హెరిటేజ్ స్టేటస్' ఇస్తారు. వీటికి నిర్మాణ, సౌందర్య లేదా సాంస్కృతిక విలువ ఉంటుంది. అయితే హై-ర్యాంక్ పొందిన వారసత్వ ప్రదేశాల స్థాయి ఉండదు.
పాలి హిల్కి వెళుతున్న షారుఖ్ ఫ్యామిలీ :షారుఖ్, అతడి భార్య గౌరీ ఖాన్, పిల్లలు ఆర్యన్, సుహానా, అబ్రామ్ బాంద్రాలోని పాలి హిల్లోని ఒక విలాసవంతమైన అపార్ట్మెంట్కు మారనున్నారు. బాలీవుడ్ నిర్మాత వాషు భగ్నాని, అతడి ఫ్యామిలీకి చెందిన 'పూజ కాసా' అనే హై-ఎండ్ రెసిడెన్షియల్ బిల్డింగ్లో షారుక్ నాలుగు అంతస్తులను లీజుకు తీసుకున్నారు. అతడి ఫ్యామిలీ మొదటి, రెండు, ఏడు, ఎనిమిదో అంతస్తులలో ఉన్న రెండు డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్లలో ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ల అద్దె నెలకు రూ.24.15 లక్షలుగా ఉన్నట్లు సమాచారం. షారుక్ ఫ్యామిలీకి అవసరమైన భద్రతా సిబ్బంది, ఆఫీసు సెటప్ కూడా ఇందులోనే ఉంటాయి.
మన్నత్ రెనోవేషన్ వివరాలు
మన్నత్ పునర్నిర్మాణంలో మెయిన్ బంగ్లా వెనుక ఉన్న ఆరు అంతస్తుల నిర్మాణంలో రెండు ఫ్లోర్లు కొత్తగా కడుతున్నారు. దీంతో ప్రాపర్టీలో మరో 600 చదరపు మీటర్ల నిర్మాణం యాడ్ అవుతుంది. మొత్తం రెనోవేషన్ ప్రాజెక్టుకు దాదాపు రూ.25 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ పనికి రెండేళ్లు పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే షారుక్ ఖాన్ ఖచ్చితమైన టైమ్లైన్ అందించలేదు.