తెలంగాణ

telangana

సైబర్​ నేరగాళ్ల కొత్త దందా - జాగ్రత్తగా లేకుంటే సెకన్లలో అకౌంట్​ ఖాళీ! ఇలా చేస్తే సేఫ్​! - Cyber Frauds with Auto Pay

By ETV Bharat Business Team

Published : Aug 23, 2024, 12:43 PM IST

Cyber Frauds: ప్రస్తుతం సైబర్​ మోసాలు పెరిగిపోతున్నాయి. కొత్త కొత్త టెక్నిక్స్​ ద్వారా మోసగాళ్లు ప్రజల అకౌంట్ల నుంచి డబ్బులు లూటీ చేస్తున్నారు. కొంచెం అజాగ్రత్త ఉన్నామా.. అకౌంట్​ ఖాళీ అయినట్లే. ఇప్పడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం.. ప్రస్తుతం డిజిటల్​ పేమెంట్​ యాప్స్​లో చాలా మంది వినియోగిస్తున్న ఆటోపే ఆప్షన్​ ద్వారా సైబర్​ నేరగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి..

Cyber Frauds
Cyber Frauds With Auto Pay Option (ETV Bharat)

Cyber Frauds with Auto Pay Option: ప్రతి నెలా అన్ని బిల్లులు, పేమెంట్ల తేదీలను గుర్తుంచుకోవడం కష్టమే. కొన్నిసార్లు గడువు తేదీని మరిచిపోతుంటాం. సకాలంలో పేమెంట్లు చేయకపోతే.. అదనపు రుసుములను చెల్లించాల్సి వస్తుంది. వీటన్నింటిని చెక్​ పెట్టేందుకు అన్ని బ్యాంకింగ్ యాప్‌లు, డిజిటల్ పేమెంట్ యాప్స్‌.. ఆటో పే ఆప్షన్ అందిస్తున్నాయి. ఈ ఫీచర్​ను ఒక్కసారి సెట్​ చేసుకుంటే ప్రతిసారి మ్యానువల్​గా పేమెంట్స్​ చేయనవసరం లేదు. ఆటోమెటిక్​గా మనం సెట్​ చేసుకున్న సమయానికి పేమెంట్స్​ జరిగిపోతాయి. ప్రస్తుతం చాలా మంది ఈ ఫీచర్​ను ఎనేబుల్​ చేసుకుని ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే సైబర్​ నేరగాళ్లు మరో తరహా మోసానికి తెర తీశారు. ఆటోపే ఆప్షన్​ ఉపయోగించి అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు. ఒక్కసారి ఆ లింక్​ క్లిక్​ చేశామా.. ఇక అంతే సంగతులు! క్షణాల్లోనే ఖాతా ఖాళీ అయిపోతుంది. ఇంతకీ ఈ కొత్తరకం స్కామ్​ ఎలా జరుగుతోంది ? దీని బారిన పడకూడదంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం..

స్కామ్​ ఎలా చేస్తారంటే?:చాలా మంది ఓటీటీలు, డిజిటల్‌ చెల్లింపుల యాప్‌లు, ఇ-కామర్స్‌ వెబ్‌సైట్లకు సంబంధించి.. నెలనెలా చెల్లింపుల కోసం ఆటోపే ఆప్షన్​ ఉపయోగిస్తుంటారు. అయితే, ఇలాంటివారికి ఈ నెల ఆటోపే ఆప్షన్​ ద్వారా డబ్బులు చెల్లించండని మోసగాళ్లు తప్పుడు మెసేజ్​లను పంపిస్తున్నారు. ఉదాహరణకు మీరు ఒక ప్రముఖ ఓటీటీ యాప్‌ను వాడుతున్నారనుకుందాం. దానికి ప్రతినెల బిల్లును ఆటోపే ద్వారా చెల్లిస్తున్నారు. మీకు మోసగాళ్లు బిల్లు చెల్లించమని సందేశం పంపిస్తుంటారు. ఇప్పటికే మీరు ఆటోపే చేస్తున్నారు కాబట్టి, అనుమానం రాదు. నిజమే అనుకొని, దాన్ని ఆమోదిస్తారు. అంతే ఆ అమౌంట్​ మొత్తం మోసగాడి చేతికి వెళ్లిపోతుంది.

ఇప్పుడే ఎందుకు?:సైబర్​ మోసాలను అరికట్టేందుకు డిజిటల్‌ చెల్లింపు సేవలను అందించే సంస్థలతో పాటు, నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. కానీ, సైబర్‌ నేరగాళ్లు టెక్నాలజీ సహాయంతో రోజుకో కొత్త తరహా మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇటీవల కాలంలో చాలా మంది ఆటోపే ఆప్షన్​ వినియోగించడంతో ఈ తరహా మోసాలు వెలుగు చూస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

మనమే అవకాశం ఇస్తున్నాం!:ఎక్కువ మంది తమ ఫోన్‌ నంబర్లను యూపీఐ ఐడీలుగా ఉంచుకుంటున్నారు. అయితే ఇలాంటి వారందరిని చాలా సులభంగా మోసగాళ్లు లక్ష్యంగా చేసుకుంటారని.. తద్వారా మన ఫోన్‌ నంబరున్న యూపీఐ ఐడీకి వివిధ రకాల మెసేజ్​లు పంపిస్తుంటారని చెబుతున్నారు. ఇందులో తెలియకుండా ఏ లింక్​ క్లిక్​ చేసినా.. అంతే సంగతులు.

ఇలా సురక్షితంగా ఉండండి!

  • నివేదికల ప్రకారం.. ఎక్కువ మంది సీనియర్‌ సిటిజన్లే ఆటోపే మోసాల బారిన పడుతున్నారు. కాబట్టి, పెద్దలు డిజిటల్‌ చెల్లింపుల యాప్‌లను వాడేటప్పుడు అలర్ట్​గా ఉండాలని సూచిస్తున్నారు.
  • ఆన్​లైన్​లో పేమెంట్​ చేస్తున్నప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్​ చేసుకుని చెల్లింపులు చేయాలని వివరిస్తున్నారు.
  • మీ ప్రైమరీ బ్యాంకు ఖాతాకు యూపీఐని లింక్​ చేయకపోవడం మంచిది. పేమెంట్స్​ కోసం తక్కువ డబ్బులు నిల్వ ఉండే అకౌంట్​ వాడటం మంచిదని చెబుతున్నారు.
  • తక్కువ మొత్తంతో వ్యాలెట్లను ఉపయోగించడం వల్ల ఈ మోసాల నుంచి కాపాడుకోవచ్చని.. యూపీఐ ఆటోపే ఆప్షన్​ వచ్చినప్పుడు, దానికి స్పందించక పోవడమే మంచిదంటున్నారు.
  • ముఖ్యంగా యూపీఐ ఐడీలుగా మొబైల్‌ నంబర్లను ఉపయోగించడం మానేయాలి. కొత్త యూపీఐ ఐడీలను క్రియేట్​ చేసుకోవాలి.
  • ఆటోపే ఆప్షన్​ రాకుండా అవసరమైన సెట్టింగులను మార్చుకోవాలి.
  • నాలుగంకెల యూపీఐ పిన్‌ బదులు ఆరు అంకెలను ఉపయోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

సైబర్​ నేరగాళ్ల కొత్త పన్నాగాలు - ఆన్​లైన్​లో రెస్టారెంట్లు, హోటళ్లకు రేటింగ్​ అంటూ మోసం

పెచ్చరిల్లుతున్న సైబర్ నేరాలు - వాటిని ఎదుర్కొనే మార్గాలు ఇవే!!

ABOUT THE AUTHOR

...view details