SME IPO Scams :భారతదేశంలో నేడు ఐపీఓలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏస్ ఇన్వెస్టర్ల నుంచి సాధారణ పెట్టుబడిదారుల వరకు ప్రతి ఒక్కరూ ఐపీఓలకు అప్లై చేస్తున్నారు. దీనినే అవకాశంగా తీసుకుని కొన్ని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థలు భారీ మోసాలకు పాల్పడుతున్నాయి. అది ఎలా అంటే?
బిగ్ స్కామ్
"మీ కంపెనీ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు వచ్చే ఆలోచన ఉందా? మీ కంపెనీ విలువను అసలు కంటే అధికంగా చూపిస్తాం. అప్పుడు మీరు పబ్లిక్ ఇష్యూకు వెళ్లి పెద్ద మొత్తంలో నిధులు సమీకరించవచ్చు. కానీ మా సాయంతో మీరు సేకరించిన నిధుల్లో సగమైనా మాకు ఇవ్వాలి" అంటూ కొన్ని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు - 'చిన్న, మధ్య తరహా సంస్థల(ఎస్ఎమ్ఈ)'తో ఒప్పందం చేసుకుంటున్నాయి.
ఛార్టర్డ్ అకౌంటెంట్ల సాయంతో
కొన్ని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థలు, ఛార్టర్డ్ అకౌంటెంట్లను సంప్రదిస్తున్నాయి. పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించే ఆలోచన ఉన్న కంపెనీల ప్రమోటర్ల గురించి వారి ద్వారా తెలుసుకుంటున్నాయి. తరువాత సదరు ప్రమోటర్లను ఆకర్షించి, ఐపీఓ వల్ల కలిగే లాభాలను, అదనపు ప్రయోజనాలను చెప్పి, మోసాలకు ఒప్పిస్తున్నాయి.
మన దేశంలో ఎస్ఎమ్ఈ ఐపీఓలకు పెరుగుతున్న ఆదరణను తమకు అనుకూలంగా మల్చుకునేందుకు కొన్ని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థలు ఇలాంటి తప్పుడు పద్ధతిని అనుసరిస్తున్నాయని, ఈ పరిణామాలను గమనిస్తున్న వర్గాలు చెబుతున్నాయి. గతంలో గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన ఈ 'అక్రమ వ్యాపార విధానం', ఇప్పుడు మరికొన్ని రాష్ట్రాలకూ విస్తరించిందని సదరు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
స్కామ్ ఎలా చేస్తారంటే?
ఐపీఓకు రావాలనుకునే కంపెనీ ప్రమోటర్లు, బ్యాంకర్ల మధ్య ఒప్పంద ప్రక్రియ ఎలా జరుగుతుందో ఓ ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. రూ.100 కోట్ల లాభాన్ని ఆర్జించే ఒక కంపెనీ అసలు విలువ రూ.500 కోట్లు అనుకుందాం. అయితే ఆ కంపెనీ విలువను రూ.1000 కోట్లకు లేదా రూ.2000 కోట్లకు పెంచుతామని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ చెబుతుంది. కానీ ఐపీఓ ద్వారా అదనంగా సమీకరించిన డబ్బులో సగం వాటా తమకు ఇవ్వాలని కండిషన్ పెడుతుంది. ఇది లాభదాయకంగా ఉంటుంది కనుక చాలా చిన్న, మధ్య తరహా సంస్థలు (SME) దీనికి ఒప్పుకుంటున్నాయి. దీనితో కంపెనీల విలువను అధికంగా పెంచి చూపిస్తున్నాయి సదరు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థలు. ఇందుకోసం నకిలీ రశీదులు, పద్దు పుస్తకాలను సృష్టించేందుకు కొందరు చార్టర్డ్ అకౌంటెంట్ల సాయాన్ని అవి తీసుకుంటున్నాయి.
అధిక స్పందన కోసం వక్రమార్గం
కొన్ని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు - ఐపీఓలకు ఓవర్ సబ్స్క్రిప్షన్ చూపించడం కోసం, ధనవంతులతో ఇన్వెస్ట్ చేయిస్తున్నాయి. అంటే ధనవంతుల చేత ఎక్కువ సంఖ్యల్లో బిడ్లు వేయిస్తున్నాయి. సాధారణ మదుపర్లను ఆకర్షించేందుకు ఈ వ్యూహాన్ని వాడుతున్నాయి.