తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టెక్నాలజీ వినియోగంలో ఎథిక్స్ పాటించాల్సిందే: ప్రధాని మోదీ

టెక్నాలజీ నైతిక వినియోగం కోసం నియమ, నిబంధనలు రూపొందించాలన్న మోదీ - త్వరలోనే పూర్తి మేడిన్‌ ఇండియా మొబైల్స్‌ తీసుకొస్తున్నట్లు మోదీ ప్రకటన

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Updated : 3 hours ago

PM Modi IMC 2024
PM Modi IMC 2024 (ANI)

PM Modi IMC 2024 :ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞాన వినియోగం విషయంలో నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందుకోసం అంతర్జాతీయ సంస్థలు​ కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. నాలుగేళ్లకు ఒకసారి జరిగే వరల్డ్ టెలీకమ్యూనికేషన్‌ స్టాండర్డైజేషన్‌ అసెంబ్లీ-2024 (WTSA 2024)ను దిల్లీలోని భారత్​ మండపంలో ప్రధాని మోదీ మంగళవారం ప్రారంభించారు. అలాగే దేశీయ ఆవిష్కరణలు ప్రదర్శించేందుకు నిర్వహించే ఇండియన్‌ మొబైల్ కాంగ్రెస్‌ ఈవెంట్‌ 8వ ఎడిషన్‌ను కూడా ఈ కార్యక్రమంలోనే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విమానయాన రంగానికి గ్లోబల్​ కమ్యూనిటీ సమగ్రమైన ఫ్రేమ్​వర్క్​ను రూపొందించినట్లే, డిజిటల్ ప్రపంచానికి కూడా నియమాలు, నిబంధనలు అవసరమని అన్నారు.

'భారతదేశంలో 120 కోట్ల మొబైల్​, 95 కోట్ల ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. ప్రపంచంలోనే 40 శాతానికి పైగా డిజిటల్ లావాదేవీలు భారతదేశంలో జరుగుతున్నాయి. డిజిటల్ పబ్లిక్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ను విజయవంతంగా నిర్మించడంలో భారతదేశం తన అనుభవాన్ని ఇతర దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉంది. కేవలం పదేళ్లలోనే ఏర్పాటు చేసిన ఆప్టికల్ ఫైబర్-​ భూమి, చంద్రుని మధ్య దూరం కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ. రెండు సంవత్సరాల క్రితం మొబైల్​ కాంగ్రెస్​లోనే 5జీ సేవలను ప్రారంభించాం. దేశంలోని ప్రతి జిల్లాను 5జీ సేవలతో అనుసంధానం చేశాం. ఇప్పుడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద 5జీ మార్కెట్​గా భారతదేశం అవతరించింది. ప్రస్తుతం 6జీ టెక్నాలజీ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాం.' అని మోదీ తెలిపారు.

'మేడిన్​ ఇండియా మొబైల్స్​ అందించాలి'
భారతదేశం గత దశాబ్దంలో దిగుమతిదారుడి నుంచి మొబైల్ ఫోన్స్ ఎగుమతిదారుగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. '2014లో దేశంలో రెండు మొబైల్ తయారీ యూనిట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఆ సంఖ్య 200పైకి చేరింది. ఇంతకుముందుకు విదేశాల నుంచి ఫోన్​లను దిగుమతి చేస్తున్నాం. ప్రస్తుతం ఏకంగా ఆరు రెట్లు మొబైల్స్​ను తయారు చేస్తున్నాం. చిప్​లతో మాత్రమే ఆగిపోలేదు. ప్రపంచానికి మేడిన్​ ఇండియా మొబైల్స్ అందిచడంలో నిమగ్నమై ఉన్నాం. సెమీ కండక్టర్స్ రంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్నాం. ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి. సాంకేతికత వినియోగంపై అప్రమత్తంగా ఉండాలి. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ను మంచి కోసమే వినియోగించాలి' అని ప్రధాని మోదీ అన్నారు.

Last Updated : 3 hours ago

ABOUT THE AUTHOR

...view details