తెలంగాణ

telangana

హరియాణాలో హోరాహోరీ! బలం పెంచుకునేలా 'కాంగ్రెస్' వ్యూహాలు- వారిపైనే 'కమలం' ఆశలు! - Haryana Elections 2024

By ETV Bharat Telugu Team

Published : Aug 22, 2024, 6:53 AM IST

Updated : Aug 22, 2024, 7:03 AM IST

Haryana Elections 2024 : హరియాణాలో అక్టోబర్‌ 1న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఆ రాష్ట్ర రాజకీయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్‌ ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న హరియాణాలో దశాబ్ధ కాలం తర్వాత ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని హస్తం పార్టీ తహతహలాడుతోంది. పంటలకు కనీస మద్దతు ధర, అగ్నిపథ్‌, రెజ్లర్ల అంశాలను అవకాశాలుగా మల్చుకొని బీజేపీ నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని చూస్తోంది. పంజాబ్‌లో అనూహ్య విజయం సాధించిన ఆమ్‌ఆద్మీ పార్టీ కూడా హరియాణాలో సత్తా చాటాలని చూస్తోంది.

Haryana Elections 2024
Haryana Elections 2024 (ETV Bharat)

Haryana Elections 2024 : హరియాణాలో అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. 90 శాసనసభ స్థానాలున్న ఆ రాష్ట్ర అసెంబ్లీ గడువు ఈ ఏడాది నవంబర్‌ 3న ముగియనుంది. ఈ క్రమంలో 2014 నుంచి అధికారంలో ఉన్న బీజేపీని మట్టికరిపించి మళ్లీ హరియాణాను చేజిక్కించుకోవాలని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ ప్రణాళికలు రచిస్తోంది. సైనికుల సంఖ్య ఆ రాష్ట్రం నుంచి ఎక్కువ ఉండటం వల్ల ఆర్మీ సిబ్బందికి అగ్నిపథ్‌ పథకంతో జరిగే నష్టాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని యోచిస్తోంది. పంటలకు కనీస మద్దతుధరకు సంబంధించి హరియాణా రైతుల పోరాటానికి ఎప్పటి నుంచో మద్దతిస్తున్న కాంగ్రెస్‌, ఆ అంశాన్నీ ప్రజలకు దగ్గర చేసేందుకు సిద్ధమైంది. హరియాణాలో రెజ్లర్ల సంఖ్య చాలా ఎక్కువ. UP, హరియాణా రెజ్లర్ల సంఘాల మధ్య పలు అంశాల్లో పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో మహిళా రెజ్లర్లపై బ్రిజ్‌భూషణ్‌ లైంగిక వేధింపులను మరో అస్త్రంగా మార్చుకోవాలని హస్తం పార్టీ నిర్దేశించుకుంది.

ద్విముఖ పోరు
హరియాణాలో ఎన్ని పార్టీలున్నా ప్రధాన పోరు కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంటూ వస్తోంది. జేపీపీ, ఐఎన్​ఎల్​డీ, బీఎస్​పీ పార్టీలూ అక్కడ ఓటు బ్యాంకును కలిగి ఉన్నాయి. హరియాణా అసెంబ్లీలో 90 స్థానాలకుగాను ప్రస్తుతం బీజేపీకి 41, కాంగ్రెస్‌కు 30, జేపీపీకి 10 ఐఎన్​ఎల్​డీ, హెచ్​ఎల్​పీ పార్టీలకు చెరో సీటు ఉండగా, మరో ఆరుగురు ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు. 2014లో హరియాణాలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి 2019లో 40 స్థానాలు వచ్చాయి. ఈ క్రమంలో 10 స్థానాలు గెలిచిన జేపీపీతో కలిసి అధికారాన్ని నిలుపుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒక్క స్థానాన్నీ గెలుచుకోలేకపోయింది. అయితే తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పదింటిలో 5 స్థానాలే గెలవగా మిగిలిన ఐదింటిని కాంగ్రెస్‌, హస్తగతం చేసుకుంది.

కమల వికాసం కష్టమేనా?
2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు జాట్లు, రైతులు, దళితులు మద్దతుగా నిలిచారు. ఈ పరిణామంతో తాము బలపడ్డామని విశ్లేషించుకున్న కాంగ్రెస్‌, మరింత ఉత్సాహంతో కమలనాథుల్ని ఢీకొట్టేందుకు సిద్ధమైంది. పెద్దగా జాతీయాంశాలుగానీ, మోదీ మేనియా వంటివి లేవని కాంగ్రెస్‌ భావిస్తోంది. 2019లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సాయపడి కింగ్‌మేకర్‌గా నిలిచిన జేజేపీ, ఇప్పుడు బీజేపీకి దూరమైంది. హరియాణాలో బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ఈసారి కాంగ్రెస్‌కు సహాయం చేసేందుకు తాము సిద్ధమని జేజేపీ ఆ మధ్య ప్రకటించడం హస్తం పార్టీకి కలిసివచ్చే అంశంగా కనిపిస్తోంది.

బీజేపీ అస్త్రాలవే!
గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో జాట్‌ యేతర వర్గాల ఓట్లు ఎక్కువగా బీజేపీకి పడ్డాయి. అందుకే జాట్‌యేతర మనోహర్‌లాల్‌ కట్టర్‌ను, తర్వాత ఓబీసీ నేత నాయబ్‌సింగ్‌ సైనీని బీజేపీ సీఎంగా చేసింది. అగ్రకులాలు, పట్టణ ఓటర్లను ఆకర్షించేందుకు వరస తాయిలాలు ప్రకటిస్తోంది. బ్రాహ్మణుడైన మోహన్‌లాల్‌ బదోలీ రూపంలో అగ్రవర్ణ నేతను రాష్ట్ర పార్టీ అధ్యక్షున్ని చేసింది. కాంగ్రెస్‌లో భూపీందర్, సెల్జా వర్గాల మధ్య కుమ్ములాటలు తమకు కలిసి వస్తాయని కమలదళం అంచనా వేస్తోంది.

ప్రాంతీయ పార్టీలు గల్లంతే!
హరియాణాలో జేజేపీ, ఐఎన్​ఎల్​డీ రెండూ కొన్నేళ్లుగా ప్రజాదరణ కోల్పోతూ వస్తున్నాయి. రాష్ట్ర జనాభాలో 26 శాతమున్న జాట్‌ వర్గమే ఆ పార్టీలకు బలం. అయితే జాట్లు ఇటీవల కాంగ్రెస్‌ వైపు వెళుతున్నారు. రైతుల ఆందోళనల సమయంలో బీజేపీ పక్షాన నిలవడం వల్ల జేజేపీకి జాట్లు దూరమయ్యారు. ఈసారి బీఎస్​పీతో పొత్తు బాగా కలిసొస్తుందని ఆశలు పెట్టుకున్న ఐఎన్​ఎల్​డీది కూడా ఇదే పరిస్థితిలా కనిపిస్తోంది.

ఇక హరియాణాలో సొంతంగా పోటీ చేస్తామని ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఇది ఇండియా కూటమిలో భాగమైనప్పటికీ పంజాబ్‌లో గెలిచిన ధైర్యంతో ముందుకెళుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో చేతులు కలిపిన ఆప్‌ ఒక స్థానంలో పోటీ చేసినా విజయం సాధించలేకపోయింది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను దూరం చేసుకున్నా, పెద్దగా నష్టం లేదని కాంగ్రెస్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. హరియాణాలో అక్టోబర్‌ 1న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్‌ 4న ఫలితాలను ప్రకటించనున్నారు.

బీజేపీకి ఓట్ షేర్ ఎఫెక్ట్​- 0.7శాతం తేడాతో 63స్థానాలకు గండి- కాంగ్రెస్​కు డబుల్​ బెనిఫిట్! - Lok Sabha Election Results 2024

జమ్ముకశ్మీర్​, హరియాణా ఎన్నికల షెడ్యూల్ రిలీజ్- పోలింగ్, కౌంటింగ్ తేదీలు ఇవే! - Assembly elections 2024

Last Updated : Aug 22, 2024, 7:03 AM IST

ABOUT THE AUTHOR

...view details