Free Travel On Highways : ప్రైవేటు వాహనాల యజమానులకు కేంద్రం శుభవార్త చెప్పింది! గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్(GNSS) వ్యవస్థ కలిగిన ప్రైవేటు వాహనాలు ఇకపై జాతీయ రహదారులపై రోజుకు 20 కిలోమీటర్ల వరకు ఎలాంటి టోల్ఛార్జీ లేకుండా ఉచితంగా తిరగొచ్చని ప్రకటించింది. దాంతోపాటు వంతెనలు, బైపాస్ లేదా సొరంగాలను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు అని పేర్కొంది. ఈ మేరకు జాతీయ రహదారుల రుసుము నియమాలు, 2008 నింబంధనలను సవరిస్తూ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
ప్రస్తుతం ఉన్న టోల్గేట్ వ్యవస్థ స్థానంలో శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం కొంతకాలంగా కసరత్తు చేస్తోంది. కొత్త విధానంలో టోల్గేట్ దగ్గర ఆగి, ఫీజు చెల్లించాల్సిన పని లేదు. మనం ప్రయాణించిన దూరాన్ని జీపీఎస్ ఆధారంగా లెక్కించి, టోల్ వసూలు చేస్తారు. ఇందుకోసం GNSS వ్యవస్థను ఉపయోగిస్తారు. ఇప్పుడు ఆ వ్యవస్థ కలిగి ఉన్న వాహనాల విషయంలో కేంద్రం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అనుసరిస్తున్న ఫాస్టాగ్, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ టెక్నాలజీకి అదనంగా ఈ కొత్త విధానం అమలు కానుంది. కాగా, GNSS ద్వారా టోల్ వసూలు చేయడానికి సంబంధించిన పైలట్ స్టడీని, కర్ణాటకలో బెంగళూరు-మైసూరు జాతీయ రహదరి ఎన్హెచ్-275పై చేసినట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇంతకుముందు వెల్లడించారు.