తెలంగాణ

telangana

దిల్లీలో వరుణుడి బీభత్సం - ఇద్దరు మృతి - వర్షంలోనే సివిల్స్ అభ్యర్థుల నిరసనలు - Delhi Rains

By ETV Bharat Telugu Team

Published : Aug 1, 2024, 7:14 AM IST

Delhi Heavy Rains : దేశ రాజధాని నగరాన్ని భారీవర్షాలు వీడటం లేదు. బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల నడుములోతు నీరు నిలిచిపోయి ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్​ అలర్ట్ ప్రకటించింది. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.

Delhi Heavy Rains
Delhi Heavy Rains (ANI)

Delhi Heavy Rains :దేశ రాజధాని దిల్లీలో వాన దంచికొట్టింది. రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసిన వాతావరణ శాఖ తప్పనిసరి ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. గాజిపూర్‌ కాల్వలో పడి తల్లీబిడ్డ మృతిచెందగా, సబ్జీమండిలో ఓ ఇల్లు కూలి పలువురు గాయపడ్డారు. రోడ్లపై పెద్దమొత్తంలో వాననీరు నిలవటం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 10విమానాలను దారి మళ్లించారు. అటు ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హరియాణాతోపాటు కర్ణాటకలోని కొన్నిచోట్ల భారీవర్షాలు కురుస్తున్నాయి.

బుధవారం సాయంత్రం నుంచి కురుకుస్తున్న కుండపోత వర్షానికి అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. కన్నాట్ ప్లేస్, కుతుబ్ మినార్, లుటియన్స్ దిల్లీ, కశ్మీర్‌గేట్, కరోల్ బాగ్, ప్రగతిమైదాన్‌, ITO, ఎయిమ్స్‌, మాన్సింగ్‌ రోడ్‌, మింటోరోడ్, పార్లమెంట్‌, నౌరోజి నగర్‌సహా అనేకప్రాంతాల్లో వాననీరు నిలిచిపోయింది. చాలాచోట్ల నడుములోతు వరకు వాననీరు నిలవటం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా దిల్లీవాసులు అర్ధరాత్రైనా ఇళ్లకు చేరుకోలేకపోయారు.

వరద తీవ్రత దృష్ట్యా ట్రాఫిక్‌ పోలీసులు చాలా మార్గాల్లో రాకపోకలను నిలిపేశారు. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. వరద తీవ్రత, వాతావరణ విభాగం హెచ్చరికలతో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అనవసర ప్రయాణాలు చేయద్దని ప్రజలకు సూచించింది. ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా దిల్లీ విమానాశ్రయంలో పలు విమానాలను ఇతర ప్రాంతాలకు మళ్లించారు.

వానలోనే ఆందోళనలు
గాజిపూర్‌లో కాల్వలో ఓ మహిళ, ఆమె మూడేళ్ల బాలుడు మృతిచెందారు. భారీ వర్షానికి సబ్జీమండిలో ఓ ఇల్లుకూలింది. 5 అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల నుంచి ఒకరిని బయటకుతీసి, ఆస్పత్రికి తరలించారు.

మరోవైపు ముగ్గురు సివిల్స్‌ విద్యార్థుల మృతికి నిరసనగా ఓల్డ్‌ రాజిందర్‌నగర్‌లో విద్యార్థులు అర్ధరాత్రి వర్షంలోనూ ఆందోళన కొనసాగించారు. మోకాళ్లలోతు నీటిలో నిల్చుని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సెనాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

విద్యాసంస్థలకు సెలవు
ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హరియాణాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. హరిద్వార్‌లో ఓ ఇల్లుకూలి ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు గాయపడ్డారు. తెహ్రీ జిల్లాలో వరద పోటెత్తటం వల్ల ఒక కుటుంబం గల్లంతైంది. సుఖీ నదిలో కన్వారియాల రేషన్‌లోడ్‌ ఉన్న ట్రక్కు కొట్టుకుపోయింది. హరియాణాలో చాలా ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపించాయి. వాహనదారులు వరదలో ఇళ్లకు వెళ్లటానికి తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. కర్ణాటకలోని ఉడిపి, దక్షిణ కన్నడ జిల్లాల్లో భారీ వర్ష సూచన నేపథ్యంలో విద్యాసంస్థలకు గురువారం సెలవు ప్రకటించారు. సముద్ర, నదీ తీరాలు కొండప్రాంతాలకు వెళ్లొద్దని సమీప ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

వయనాడ్​ విలయానికి 184 మంది బలి- అదానీ రూ.5 కోట్ల సాయం - wayanad landslide 2024

వయనాడ్ విపత్తు నుంచి కుటుంబాన్ని కాపాడిన 'ఆవు'- లేకుంటే అంతా మట్టిలోనే! - Wayanad landslides

ABOUT THE AUTHOR

...view details