Kolkata RG Kar Hospital CISF :సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర పారిశ్రామిక రక్షణ దళం-CISF వైద్యురాలిపై హత్యాచారం జరిగిన కోల్కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రి వద్దకు చేరుకుంది. భద్రతా ఏర్పాట్లపై ఆస్పత్రి వర్గాలు, స్థానిక పోలీసులతో బుధవారం చర్చించింది. అనంతరం ఆస్పత్రిలో రెక్కీ నిర్వహించింది. ఆగస్టు 15 అర్ధరాత్రి ఆస్పత్రి ఆవరణలో దుండగలు దాడి చేస్తున్నా పోలీసులు నివారించకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ఘటన తర్వాత చాలామంది వైద్యులు క్యాంపస్ను విడిచివెళ్లిపోయారని, అక్కడ సురక్షిత వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. కేంద్ర బలగాలు ఆసుపత్రి వద్ద రక్షణ కల్పిస్తాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే CISF బలగాలు ఆర్జీ కార్ ఆస్పత్రి వద్దకు చేరుకున్నాయి.
హత్యాచారం జరిగిన ఆస్పత్రి వద్ద CISF రెక్కీ- మాజీ ప్రిన్సిపల్కు పాలిగ్రాఫ్ టెస్ట్! - Kolkata RG Kar Hospital CISF
Published : Aug 21, 2024, 4:11 PM IST
Kolkata RG Kar Hospital CISF : పార్లమెంటు, విమానాశ్రయాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు రక్షణ కల్పించే కేంద్ర పారిశ్రామిక రక్షణ దళం- CISF కోల్కతాలోని ఆర్జీ కర్ బోధనాసుపత్రి వద్ద రెక్కీ నిర్వహించింది. సీనియర్ అధికారి నేతృత్వంలోని CISF బృందం ఆస్పత్రి వద్దకు చేరుకుని భద్రతా ఏర్పాట్లపై స్థానిక పోలీసులు, ఆస్పత్రి వర్గాలతో చర్చించింది.
అటు ఆగస్టు 15న ఆస్పత్రి వద్ద గుర్తుతెలియని వ్యక్తులు విధ్వంసం సృష్టించిన వ్యవహారంలో కోల్కతా పోలీసు విభాగం చర్యలు చేపట్టింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఇద్దరు ఏసీపీలు, ఒక ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేసింది. హత్యాచారానికి వ్యతిరేకంగా వైద్యులు, మహిళలు నిరసన తెలుపుతుంటే ముసుగులు ధరించిన విధ్వంసకారులు కర్రలు, ఇటుకలు, రాడ్లతో ఆస్పత్రి ఆవరణలోకి దూసుకొచ్చి దాడులు చేశారు. అత్యవసర గది, నర్సింగ్ స్టేషన్, మందుల దుకాణం, ఔట్ పేషంట్ విభాగాలతోపాటు సీసీటీవీలను ధ్వంసం చేశారు.
మాజీ ప్రిన్సిపల్కు పాలిగ్రాఫ్ టెస్ట్!
మరోవైపు, వైద్యురాలిపై జరిగిన అఘాయిత్యాన్ని ఆస్పత్రి యాజమాన్యం ఆత్మహత్యగా పేర్కొనడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ క్రమంలోనే ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత కాలేజీ ప్రిన్సిపల్గా ఉన్న డాక్టర్ సందీప్ ఘోష్ రాజీనామా చేశారు. ఈ కేసులో ఆయన కూడా విచారణను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే సీబీఐ పలుమార్లు ఆయనను ప్రశ్నించింది. అయితే విచారణ సందర్భంగా సందీప్ ఘోష్ పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. రౌండ్, రౌండ్కు తన జవాబులను మార్చి చెప్పినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. "ఆయన చెప్పిన సమాధానాల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. అందువల్ల ఆయనకు పాలిగ్రాఫ్ పరీక్షను నిర్వహించే అవకాశాలపై మేం ఆలోచన చేస్తున్నాం" అని సీబీఐ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో ఘోష్ బుధవారం కూడా దర్యాప్తు సంస్థ ఎదుట హాజరయ్యారు.