Bihar 38 Years Old Scam : కాలువ మరమ్మత్తు పనుల్లో రూ.20 వేలు విలువైన కుంభకోణానికి సంబంధించిన కేసులో 38ఏళ్ల తర్వాత ఓ రిటైర్డ్ ఇంజినీర్కు 4ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు బిహార్లోని ముజఫర్పుర్ స్పెషల్ మానిటరింగ్ కోర్టు ఈ తీర్పునిచ్చింది. దోషికి రూ.10 వేల జరిమానాను సైతం విధించింది. ఘోరసహన్ త్రివేణి కెనాల్ కుంభకోణం కేసులో ఈ తీర్పును ఇచ్చింది. దోషి జరిమానా చెల్లించని పక్షంలో జైలు శిక్షను పెంచనున్నట్లు తెలిపింది.
38ఏళ్ల కిందట ఆరోపణలు
బిహార్లోని త్రివేణి కెనాల్ మరమ్మతుల్లో రూ.20 వేల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. రూ.20,925 కుంభకోణం జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై 1987 జూన్లో అప్పటి మానిటరింగ్ ఇన్స్పెక్టర్ అరుణ్ కుమార్ సింగ్ వినీత్ 13 ఏఫ్ఐఆర్లను నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన ముజఫర్ నగర్ స్పెషల్ మానిటరింగ్ కోర్టు, పట్నాకు చెందిన రిటైర్డ్ అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) సురేంద్రనాథ్ వర్మ (76)ను దోషిగా తేల్చింది. ఈ క్రమంలో అతడికి 4ఏళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది.
త్రివేణి కెనాల్ మరమ్మతుల కుంభకోణం కేసులో అప్పటి ఏఈ సురేంద్రనాథ్ వర్మతో పాటు మరో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామచంద్ర ప్రసాద్ సింగ్, అప్పటి జూనియర్ ఇంజినీర్ నావల్ కిషోర్ ప్రసాద్ సింగ్, కాంట్రాక్టర్ సమీఖాన్ను నిందితులుగా చేర్చారు. కాంట్రాక్టర్ సమీఖాన్ కేవలం రూ.1031కే పనులు చేసినట్లు విచారణలో తేలిందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. కానీ, లంచం తీసుకుని సమీఖాన్కు ఇంజినీర్లు రూ.21,956కు కాంట్రాక్టును ఇచ్చారని పేర్కొన్నారు. ఈ క్రమంలో రూ.20,925 కుంభకోణం జరిగిందని వెల్లడించారు.