Air India Cancels Flight To Israel :భారత విమానయాన సంస్థ ఎయిర్ఇండియా తాత్కాలికంగా ఇజ్రాయెల్కు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పశ్చిమాసియాలో రోజురోజుకూ ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతుండడమే ఇందుకు కారణమని తెలిపింది.
ఓ వైపు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం జరుగుతుండగా, మధ్యలో హెజ్బొల్లా, ఇరాన్ జోక్యం చేసుకున్నాయి. దీనితో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత విమానయాన సంస్థ ఎయిర్ఇండియా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్కు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ఆగస్టు 8 వరకు మాత్రమే!
ఆగస్టు 2 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు టెల్అవీవ్ నుంచి భారత్కు వచ్చే విమానాలను, ఇక్కడ నుంచి అక్కడకు వెళ్లే విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఎయిర్ఇండియా స్పష్టం చేసింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి సర్వీసుల పునరుద్ధరణపై ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఆగస్టు 8వ తేదీ వరకు దిల్లీ-టెల్ అవీవ్ మధ్య ప్రయాణాల కోసం ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు మినహాయింపులు ప్రకటించింది. టికెట్ల రద్దు, రీషెడ్యూలింగ్పై ఒకసారి ఛార్జీల మినహాయింపు ఇస్తామని తెలిపింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.