తెలంగాణ

telangana

ETV Bharat / bharat

27 మంది మావోయిస్టులు హతం - ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ - CHHATTISGARH ENCOUNTER

ఛత్తీస్‌గఢ్‌-ఒడిశా సరిహద్దులో భారీ ఎన్​కౌంటర్​- 27 మంది మావోయిస్టులు మృతి - మృతుల సంఖ్య పెరిగే అవకాశం!

Chhattisgarh Encounter
Chhattisgarh Encounter (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jan 21, 2025, 9:43 AM IST

Updated : Jan 22, 2025, 6:58 AM IST

Chhattisgarh Encounter :ఛత్తీస్‌గఢ్‌-ఒడిశా సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. గరియాబంద్‌, నౌపాడ జిల్లాల్లో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు 27 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం. మరి కొంత మందికి తీవ్రగాయాలవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు 20 మంది మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. భీకర ఎన్‌కౌంటర్‌ కొనసాగుతున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల సరిహద్దులోని అటవీ ప్రాంతం రణరంగంలా మారింది.

మావోయిస్టులను చుట్టుముట్టిన కోబ్రా సైనికులు, వెంటనే లొంగిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ మావోయిస్టులు పెద్ద ఎత్తున ఎదురు కాల్పులు జరుపుతున్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు ఆపరేషన్‌ను మరింత ముమ్మరం చేశాయి.

రూ.1కోటి రివార్డ్ నక్సల్ చలపతి హతం
ఛత్తీస్‌గఢ్‌- ఒడిశా సరిహద్దులోని జరిగిన భారీ ఎన్​కౌంటర్​లో అనేక మంది మావోయిస్టులు మంగళవారం హతమయ్యారు. వీరిలో రూ.1కోటి రివార్డ్ నక్సల్ చలపతి కూడా ఉన్నారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా సరిహద్దు జిల్లాలైన గరియాబంద్‌, నౌపాడలో ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది కలిసి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా జనవరి 19 రాత్రి ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు అధికారి తెలిపారు. జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), ఛత్తీస్‌గఢ్ CoBRA, ఒడిశా స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (SOG), భద్రతా సిబ్బంది ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు ఆయన చెప్పారు.

సోమవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా నక్సలైట్లు మరణించగా, ఒక కోబ్రా జవాన్ గాయపడ్డారు. చికిత్స నిమిత్తం హెలికాప్టర్​లో ఆయనను రాయ్​పుర్​కు తరలించారు. ఎన్‌కౌంటర్ జరిగిన స్థలం నుంచి పెద్ద మొత్తంలో తుపాకులు, మందుగుండు సామగ్రి, IEDలు, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు మంగళవారం ఉదయం కూడా కాల్పులు కొనసాగగా, అనేక మంది నక్సల్స్ హతమయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఇప్పటివరకు 20 మంది నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని గరియాబాద్ ఎస్​పీ నిఖిల్ రఖేచా తెలిపారు. అందులో కోటి రూపాయల రివార్డు ఉన్న నక్సలైట్ కేంద్ర కమిటీ సభ్యుడు జయరామ్ అలియాస్ చలపతి మృతదేహం కూడా ఉందని చెప్పారు. SLR రైఫిల్ వంటి ఆటోమేటిక్ ఆయుధాలు సహా పెద్ద మొత్తంలో సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

నక్సలిజానికి మరో బలమైన దెబ్బ
అయితే ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో భారీ సంఖ్యలో నక్సల్స్ హతమవ్వడం నక్సలిజానికి మరో గట్టి దెబ్బగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అభివర్ణించారు. "నక్సలిజానికి మరో దెబ్బ. నక్సల్ రహిత భారత్‌ను నిర్మించడంలో మన భద్రతా దళాలు భారీ విజయాన్ని సాధించాయి. సీఆర్‌పీఎఫ్, ఎస్‌ఓజీ ఒడిశా, ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో 14 మంది నక్సలైట్లను మట్టుబెట్టారు" అని ఎక్స్​లో పోస్ట్ పెట్టారు.

Last Updated : Jan 22, 2025, 6:58 AM IST

ABOUT THE AUTHOR

...view details