వైద్య పరిచారికలు, వైద్యులు కొవిడ్ రోగులకు సేవలందిస్తూ అధిక మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్నారు. కుటుంబ సభ్యులకు కరోనా సోకినా ఇదే విధంగా మానసిక వేదనను అనుభవించాల్సిన పరిస్థితి. మొట్టమొదట ఈ వ్యాధి ఎంత తీవ్రంగా ఉందోనని ఆందోళన చెందుతారు. ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పాలా? లేదా? అని ఆలోచిస్తారు. కరోనా సోకిన వారన్నా.. వారికి సేవ చేసే వారన్నా సమాజం చూపే విచక్షణ మరింత బాధాకరంగా ఉంటుంది. ఆప్తులు, బంధువులు, స్నేహితులు ఇచ్చే అనవసర సలహాలు మరింత కుంగుబాటుకు కారణమవుతాయి. రోగగ్రస్తులను ఆసుపత్రికి తీసుకెళ్లటం, పరీక్షలు చేయించటం కూడా భయంతో కూడుకొని ఉంటుంది. తరచూ ప్రతికూల వార్తలను వింటూ నిరాశకు గురి కావల్సి ఉంటుంది.
సేవలందించే సిబ్బందికి క్వారంటైన్ నిబంధనల వల్ల ఉద్యోగ భద్రతకు ముప్పు ఏర్పడే ప్రమాదం పొంచి ఉంటుంది. కరోనా సోకే అవకాశం, ఇంటా.. బయటా పనులు చేసుకోలేమని ఆందోళన చుట్టుముట్టవచ్చు. వారికి వైద్య సౌకర్యాలు అవసరమైనపుడు అందాల్సిన సహాయం అందక అశక్తులుగా ఉండిపోతున్నారు. ఈ మధ్య కరోనా సమాచారం ప్రజలపై వర్షంలా కురుస్తుంది. సహజంగానే ప్రతికూల సమాచారం మీదనే మనం దృష్టి పెడతాం. ఆశాజనకంగా ఉన్న సమాచారాన్ని స్వీకరించి, వైద్యుల వద్ద నుంచి మన సందేహాలకు సమాధానాలు పొంది సేవలందించాలి.
మన కుటుంబంలో ఒక వ్యాధిగ్రస్తుడుంటే మన ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తాం. ఇది మన మనసుపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. అలాంటి సమయంలో ఇక్కడ సూచించిన అంశాలను గుర్తుంచుకోవాలి.
- సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలను కాకుండా వైద్య సిబ్బంది నుంచి సమాచారాన్ని రాబట్టండి.
- వైద్య సిబ్బందిపై నమ్మకముంచండి
- హెల్ప్ లైన్ నంబర్స్తో మాట్లాడి ఇబ్బందులను తెలియజేసి ఎలా సేవలందించాలో తెలుసుకోండి.
- ధ్యానం మొదలైన అలవాట్లతో మనసును శక్తివంతం చేసుకోండి.
- పిల్లలు, యువత కోవిడ్ బారిన పడి ఉంటే వారికి సేవలందించే వారు చాలా ఓపికగా ప్రతి కూలంగా మాట్లాడకుండా సహాయం చేయాలి.
- సంతోషకరమైన వాతావరణాన్ని కలిగించాలి.