ఒళ్లు తగ్గాలని అనుకోవడం తరువాయి తినాలనుకున్న ఆహార జాబితాలోకి వివిధ రకాల పండ్లను చేర్చేస్తాం. ఫలాలు చక్కటి పోషక పదార్థాలు. మన శరీరానికి కావాలసిన ఎన్నో పోషకాలను అందిస్తాయి. బరువు తగ్గేందుకు కొందరు తమ మెనూలో పండ్లకే అధిక ప్రాధాన్యం ఇస్తారు. అయితే, అన్ని రకాల ఫలాలూ మన శరీర బరువును తగ్గిస్తాయని చెప్పలేం. కొన్ని ఫలాల్లో అధిక శక్తినిచ్చే చక్కెర ఉంటుంది. అందువల్ల ఫలాలను ఎన్నుకోవడంలో విచక్షణ అవసరం. ఏ పండులో ఏ గుణాలున్నాయో, ఎన్ని క్యాలరీల శక్తి ఇమిడి ఉందో తెలుసుకుందాం.
1. అరటి
తక్షణం శక్తినందించే పండ్లలో అరటిది మొదటి స్థానం. అందుకే క్రీడాకారులు పోటీల విరామ సమయంలో అరటి పండ్లను ఒలుస్తూ కనిపిస్తారు. ఉదయం అల్పాహారంలో అరటి పండు, పాలు తీసుకుంటే రోజంతా ఉత్సాహంతో ఉంటారని చెబుతారు. దీనికి కారణం ఒక అరటిపండులో 37.5 గ్రా. ల పిండి పదార్థాలు ఉంటాయి. ఇవి 150 క్యాలరీల శక్తిని ఇస్తాయి. అందువల్ల ఒక రోజులో రెండు లేక మూడు అరటిపండ్లు తినే వారు శరీర బరువును కోల్పోలేరు.
2. ద్రాక్ష
శరీర బరువును అమాంతం పెంచే కొవ్వు చక్కెరలు ద్రాక్షలో అధికంగా ఉంటాయి. 100 గ్రా. ద్రాక్ష పండ్లలో 67 క్యాలరీల శక్తినిచ్చే 16 గ్రా. చక్కెర ఉంటుంది. అందువల్ల ద్రాక్ష పండ్లను ఎక్కువగా తింటే శరీర బరువు పెరగడం ఖాయం.
3. మామిడి
మామిడి పండ్లలోనూ అధిక క్యాలరీల శక్తి దాగి ఉంది. ఒక మామిడి పండులో 25 గ్రా. పిండి పదార్ధాలు, 23 గ్రా. చక్కెర, 3గ్రా. పీచు పదార్థం ఉండి 99 క్యాలరీల శక్తినిస్తాయి. అందువల్ల మామిడి పండ్లను పరిమితంగానే తీసుకోవాలి.
4. సపోటా
నోరూరించే సపోటా పండ్లు ఆరోగ్యానికి మంచివైనా వీటిలో అత్యధిక ప్రమాణంలో పిండి పదార్థాలు, చక్కెరలు ఉంటాయి. 100గ్రా. సపోటాలో 83 క్యాలరీల శక్తి ఉంటుంది. వీటిని తరుచూ తినేవాళ్లు శరీర బరువును కోల్పోలేరు.
5. అనాసపండు
వ్యాధులను నిరోధించే యాంటాక్సిడెంట్లు ఉన్న అనాసలో క్యాలరీలు కూడా అధికమే. 100గ్రా. అనాస పండులో 83 క్యాలరీల శక్తి ఉంటుంది. శరీర బరువు తగ్గడానికి ఇది పెద్దగా ఉపయోగపడదు.
ఎండు ఫలాలు (డ్రై ఫ్రూట్స్)
6. ఎండుద్రాక్ష, కిస్మిస్
ఎండు ద్రాక్షలో నీటి శాతం శూన్యం కావున 1 గ్రా. లో తాజా ద్రాక్ష కన్నా ఎన్నో రెట్లు క్యాలరీలు ఉంటాయి. ఒక కప్పు ఎండు ద్రాక్ష 500 క్యాలరీల శక్తిని మనకు అందజేస్తాయని ఆహార నిపుణులు కనుగొన్నారు. అందువల్ల వీటిని ఔషధ మాత్రలో తినాలి.
7. అంజీర
శరీర బరువును పెంచుకోవడానికే కొందరు ఈ పండ్లను సేవిస్తారు. వీటిలో అధిక ప్రమాణంలో చక్కెర ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన పండైనా పరిమితంగా తీసుకుంటేనే మన బరువును అదుపులో ఉంచుకోగలం.
ప్రకృతిలో లభించే రుచికరమైన తాజా ఫలాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరానికి కావలసిన పోషకాలనూ అందిస్తాయి. అయితే వాటిని అధికంగా ఆరగించడం శరీర బరువును పెంచుతుంది. మీరు ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధ పడుతున్నట్టయితే ఒక ఆహార నిపుణుడిని కానీ, చికిత్సకున్ని కానీ సంప్రదించి ఆ సమస్యకు ఎటువంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకోండి. పలు ఆహార పదార్ధాలు, క్యాలరీలు మొదలైన వివరాలున్న జాబితాను తయారుచేసుకుని, ఏ ఫలాన్ని ఎప్పుడు ఎంత తినవచ్చో తెలుసుకోండి.