యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలోని బాలాలయంలో శ్రావణ శుక్రవారం స్వామి, అమ్మవార్లకు ఆరాధనలు, శాస్త్రోక్తంగా పూజలు చేపట్టారు. తెల్లవారుజామునే ఉత్సవమూర్తులను అభిషేకించి.. తులసి పత్రాలతో అర్చనలు జరిపారు. ఉదయం శ్రీ సుదర్శన నారసింహ హోమం, స్వామి వారి నిత్యకల్యాణం, ఆన్లైన్లో నమోదు చేసుకున్న భక్తులకు వారి గోత్రనామాలతో పరోక్ష పద్ధతి ద్వారా అర్చకులు పూజలు చేపట్టారు.
సాయంత్రం ఆండాళ్ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి ఊంజల్ సేవ మహోత్సవం నిర్వహించారు. వివిధ రకాల పూలు, పండ్లతో అమ్మవారిని అలంకరించి.. తులసి దళాలతో పూజలు చేశారు. మొదట శ్రీ మన్యుసూక్త పారాయణం చేశారు. ప్రత్యేకంగా బంగారంతో తయారుచేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులు భౌతిక దూరం మాస్కులు ధరించి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు