యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామికి శాస్త్రోక్తంగా నాగవల్లి దళార్చనలు నిర్వహించారు. స్వామికి నిత్య ఆరాధనలు జరిగాయి. విష్ణు పుష్కరిణి చెంత గల ఆంజనేయస్వామిని అర్చక బృందం మన్యసూక్త పఠణాలతో అభిషేకం నిర్వహించారు. సింధూరం వివిధ రకాల పూల మాలలతో స్వామిని అలంకరించి సహస్రనామ పఠణాలతో నాగవల్లి దళార్చన నిర్వహించారు. హనుమంతుడిని ఆరాధిస్తూ ఆకుపూజ చేశారు.
స్వామివారిని చందనంతో అభిషేకించారు. హనుమయ్యకు ప్రీతికరమైన వడలు, బెల్లం, ఫలాలను నైవేద్యంగా సమర్పించారు. ప్రధాన ఆలయంలో స్వయంభూలను బాలాలయంలో కవచ మూర్తులను పూజించిన అర్చకులు.. మండపంలో ఉత్సవమూర్తులకు అభిషేకించి అర్పించారు. అనంతరం సుదర్శనహోమం, నిత్యతిరు కళ్యాణోత్సవ వేడుకలను నిర్వహించారు, అనుబంధ రామలింగేశ్వరుడిని కొలిచి చరమూర్తులను పంచామృతాలతో అభిషేకించి బిల్వ పత్రాలతో అర్పించారు. పాతగుట్ట ఆలయంలోనూ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.