రెవెన్యూ కార్యాలయాల్లో సామాన్య ప్రజలు పడే బాధలను అతిదగ్గరి నుంచి చూసిన ఆ యువజంట వేర్వేరు లక్ష్యాలతో గ్రూపు-2 పరీక్షలకు సన్నద్ధమయ్యారు. ఎలాంటి కోచింగ్ అవసరం లేకుండానే టీఎస్పీఎస్సీ గ్రూపు-2 ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం సాధించిన తొలిదంపతులుగా నిలిచారు. వాళ్లే యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పైళ్ల నవీన్ రెడ్డి-అనూష దంపతులు.
ప్రజలకు సాయం చేయాలనే ఆశయంతో...
యాదాద్రి భువనగిరి జిల్లా సుంకిశాలకు చెందిన పైళ్ల నవీన్ రెడ్డి, తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి చెందిన అనూష 2019 ఫిబ్రవరిలో వివాహబంధంతో ఒకటయ్యారు. పెళ్లికి ముందు వీరిద్దరి లక్ష్యాలు వేరుగా ఉండేవి. నవీన్ రసాయన శాస్త్రంలో పీహెచ్డీ చేయగా అనూష ఐఏఎస్ అవ్వాలని సివిల్స్కు సన్నద్ధమయ్యేది. ప్రజలకు అందుబాటులో ఉండే ఉద్యోగం సంపాదించాలనే కసి ఇద్దర్లోనూ ఉండేది. ఆ సమయంలో 2016లో గ్రూపు-2 నోటిఫికేషన్ వచ్చింది.
ఫలితాల్లో జాప్యం వల్ల వేరే కొలువులు
ఫలితాల్లో జాప్యం జరిగినందున నవీన్రెడ్డి ఎస్సై పరీక్షలు, అనూష ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారు. అనూష అసోంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా శిక్షణ తీసుకుంటుండగా కుటుంబ సభ్యులు నవీన్తో వివాహం నిశ్చయం చేశారు. పెళ్లైన కొద్దిరోజులకే విడుదలైన టీఎస్పీఎస్సీ గ్రూపు-2 ఫలితాల్లో వీరిద్దరూ ఇంటర్వూకు ఎంపికయ్యారు.
ఒకేచోట అంత ఆషామాషీ ఏం కాదు..
ఈ యువ జంటకు ఒకే శాఖలో ఉద్యోగాలు ఆషామాషీగా రాలేదు. సిలబస్ ఆధారంగా సొంత నోట్స్ తయారు చేసుకొని, రాష్ట్ర, జాతీయ అంశాలపై చర్చించుకుని, పరస్పరం మాక్ టెస్ట్లు, ఇంటర్వ్యూలు నిర్వహించుకుంటూ చివరికి అంతిమ ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్లుగా ఇద్దరూ ఉద్యోగాలు సాధించారు. ఒకే ఇంటి నుంచి.. అది కూడా భార్యాభర్తలు ఒకే క్యాడర్ ఉద్యోగులుగా ఎంపికవడం విశేషం.
రెవెన్యూ శాఖపై పడ్డ మచ్చ తొలగిస్తాం..
రెవెన్యూ శాఖపై స్పష్టమైన అవగాహనతో ఉన్న నవీన్ రెడ్డి-అనూషలు ఆ శాఖపై పడ్డ మచ్చను తొలగించేందుకు పారదర్శకంగా విధులు నిర్వహిస్తామని చెబుతున్నారు. కుటుంబ బాధ్యతల్లో పడి ఉద్యోగాలు సాధించలేం అనుకునేవారికి ఆదర్శంగా నిలుస్తూ ప్రజాసేవ కోసం జంటగా కదనరంగంలోకి అడుగుపెట్టబోతున్నారు.
ఇవీ చూడండి: తహసీల్దార్ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?