వరంగల్ రూరల్ జిల్లా హన్మకొండ డివిజనల్ పోలీసుల ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ ప్రాంగణంలో పోలీసుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పోలీస్ కమిషనరేట్ సీపీ రవీందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జీవితకాలంలో ఇలాంటి అనుభవం వస్తుందని ఊహించలేదన్నారు. కరోనా కట్టడి కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. లాక్డౌన్ను పోలీసులు పటిష్టంగా అమలు పరిచామని ఆయన తెలిపారు. లాక్డౌన్ను అమలు చేసి.. కరోనా వ్యాప్తి చెందకుండా పోలీసులు తమ వంతు బాధ్యతను నెరవేర్చడంలో, ప్రజలు బయట తిరిగి.. కరోనా వాహకాలుగా మారకుండా కట్టడి చేయడంలో పోలీసులు విజయం సాధించారని అభినందించారు. కరోనా సమయంలో కూడా విధులు నిర్వర్తించిన పోలీసుల పట్ల ప్రజలకు మరింత గౌరవం పెరిగిందన్నారు.
లాక్డౌన్ సమయంలో ప్రజలకు అవసరమయిన నిత్యవసర సరుకులను చేరవేయడంలో పోలీసులు పరోక్షంగా విధులు నిర్వర్తించారని అన్నారు. వలస కూలీలకు భోజనం, వసతి ఏర్పాట్లు కల్పించడం ద్వారా వలసకూలీలు సైతం పోలీసులు అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలిపారని.. గుర్తు చేశారు. కరోనా పూర్తిగా అంతం కాలేదని.. ఆ విషయం దృష్టిలో ఉంచుకొని విధులు నిర్వహించే పోలీసులు, సిబ్బంది చేతులను తరుచుగా శుభ్రపర్చుకోవాలని, మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. రోగనిరోధక శక్తి పెంచే ఆహారం తీసుకోవాలన్నారు. లాక్డౌన్ సమయంలో సేవలందించిన అధికారులు, సిబ్బందికి పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా జ్ఞాపికలను అందజేశారు.
ఇదీ చదవండి: ఈనెల 17న జగన్, కేసీఆర్తో ప్రధాని భేటీ