అత్యద్భుత శిల్పశోభతో అలరారే రామప్ప అందాలు విశ్వవ్యాప్తం అయ్యే శుభ సమయం ఆసన్నమవుతోంది. ప్రపంచ వారసత్వ హోదా సాధించేలా రామప్పకు కేంద్రం ప్రభుత్వం ప్రతిపాదనలు.. ఆపై యునెస్కే ప్రతినిధి బృందం పర్యటన చకచకా జరిగిపోయాయి. ఆలయంలో అణువణువు పరిశీలించిన బృందం సంతృప్తి వ్యక్తం చేసింది.
ఇదే సమయంలో రామప్పను మరింత సుందర ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ములుగు జిల్లా యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. రూ.5 కోట్లతో ఆధునాతన ఆడిటోరియం నిర్మాణం, సీఎస్ఆర్ నిధులతో స్వాగత తోరణాల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. రామప్ప చెరువులో ఉన్న ఐల్యాండ్లో భారీ శివలింగం, సుమారు 10 ఎకరాల స్థలంలో కళావేదికతో పాటు, శిల్పకళా అధ్యయనం కోసం కళాశాల ఏర్పాటు చేసేందుకు యంత్రాంగం సంకల్పించింది.
యునెస్కో సమీక్ష
ఈనెల 22న ప్యారిస్లో యునెస్కో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. ఇందుకు కేంద్ర, రాష్ట్ర పురావస్తు అధికారులు హాజరుకావాల్సిందిగా కబురందింది. అధికారులు బృందం ఇందుకు సన్నద్ధమవుతోంది.
రామప్ప సమగ్రాభివృద్ధికి రూపొందించిన మాస్టర్ప్లాన్ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ప్రపంచ వారసత్వ హోదా దక్కే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలూ తోడైతే రామప్ప కళా వైభవం.. దశదిశలా వ్యాప్తి తథ్యం..