లాక్డౌన్ కారణంగా దాదాపు 45 రోజులపాటు మద్యం దుకాణాలు మూతపడ్డాయి. మూడు రోజుల క్రితం తెరుచుకున్నా.. ధరలు ఎక్కువగా ఉండటంతో పేద, మధ్య తరగతికి చెందిన మందుబాబులు నాటుసారానే ఆశ్రయిస్తున్నారు. మందుబాబుల అవసరాన్ని అవకాశంగా మలుచుకొని కొందరు అక్రమార్కులు ఆదాయం వస్తుందన్న ఆశతో వరంగల్ గ్రామీణ జిల్లాలో నాటుసారా తయారీకి పూనుకుంటున్నారు.
కరోనా నియంత్రణకు విధించిన లాక్డౌన్ పుణ్యమా అని కొన్ని రోజులపాటు మద్యం విక్రయాలు ఆగిపోయాయి. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాల్లో మద్యం మత్తులో జరిగే ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. మళ్లీ మద్యం షాపులు తెరుచుకున్నా... ధరలు ఎక్కవగా ఉండటంతో పేదలు గుడుంబా వైపు మెగ్గుచూపుతున్నారు. ఇదే అదనుగా భావించి గ్రామాల నుంచి పట్టణాలకు నాటుసారాను యథేచ్ఛగా తరలిస్తూ కాసులు దండుకుంటున్నారు. ఆబ్కారీశాఖ అధికారులు మెరుపు దాడులు చేస్తూ గుడుంబా స్థావరాలను ధ్వంసం చేస్తున్నా... నాటుసారా రవాణాకు అడ్డుకట్ట మాత్రం పడటంలేదు.
వరంగల్ గ్రామీణ జిల్లాలో గుడుంబా తయారీ మొదలు పెట్టారు. జిల్లాలో చాలా చోట్ల నాటుసారా ఏరులై పారుతోంది. ముఖ్యంగా వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి మండలాల్లో గుడుంబా స్థావరాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సంగెం మండలం గవిచర్ల గ్రామశివారు ఆశాలపల్లి ఎక్స్ రోడ్డు వద్ద రెండు ఆటోల్లో అక్రమంగా తరలిస్తోన్న 34 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకొని ఐదుగురిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. వర్ధన్నపేట పరిధిలోని తండాల్లో 25 లీటర్ల గుడుంబా, 150 లీటర్ల బెల్లం పానకం పట్టుబడింది. నాటుసారా స్థావర నిర్వాహకులు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవలి ప్రెస్మీట్లో సీఎం కేసీఆర్ సైతం వరంగల్ గ్రామీణ జిల్లాలో నాటుసారాను అరికట్టాలని సూచించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పవచ్చు.
కరోనా పుణ్యమా అని మద్యం దుకాణాలు మూతపడటంతో ప్రశాంతంగా ఉన్న పేద, మధ్య తరగతి కుటుంబాల్లో నాటుసారా మళ్లీ అలజడి సృష్టిస్తోంది. పోలీసులు, ఆబ్కారీశాఖ అధికారులు మరింత కట్టుదిట్టంగా దాడులు నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించి... నాటుసారాను అరికట్టాలని పేద, మధ్య తరగతి మహిళలు కోరుతున్నారు.
ఇదీ చూడండి : వర్ధన్నపేటలో సరి, బేసి విధానం అమలు..