కాదేదీ కవితకనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ... అలాగే ఆలోచన ఉండాలే గాని వ్యర్థమనుకున్నదాన్ని కూడా ఉపయోగంలోకి తేవొచ్చంటున్నారు ఈ గ్రామస్థులు. హారిత హారంలో భాగంగా తమ గ్రామాన్ని ప్లాస్టిక్రహితంగా తీర్చిదిద్దాలనుకున్న గ్రామ సర్పంచ్ ఆలోచనకు... అధికారుల సహకారం తోడవడం వల్ల తాగి పాడేసిన కొబ్బరి బోండాలను ఉపయోగంలోకి తెచ్చారు. …
సర్పంచ్ ఆలోచనకు ఊతమిచ్చిన మండల అధికారులు
వరంగల్ గ్రామీణ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి హరితహారం నర్సరీలో గతంలో ప్లాస్టిక్ కవర్లలో మొక్కలు పెంచేవారు. గతేడాది ఈ నర్సరీ నుంచి తొంభైవేల మొక్కలు పంపిణీ చేశారు. మొక్కలు నాటిన తర్వాత ప్లాస్టిక్ కవర్లు వ్యర్థంగా మిగిలిపోయాయి. గమనించిన గ్రామ సర్పంచ్ పెండ్యాల మమత తమ గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చాలనే లక్ష్యాన్ని మండల అధికారుల ముందు ఉంచారు.
కవర్లు వద్దు... కొబ్బరి బొండాలే...
ఎంపీడీవో పల్లవి, ప్రత్యేక అధికారి సలహాతో నర్సరీలో ఓ వినూత్న పద్ధతిలో మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారు. తాగి పాడేసిన కొబ్బరి బోండాలను సేకరించి అందులో ఎరువును నింపి వాటిలో విత్తనాలు వేశారు. విత్తనాలు మొలకెత్తే దశకు రాగానే వాటిని భూమిలో నాటడం వల్ల కొబ్బరి పీచు భూమిలో కలిసిపోయి మొక్క వస్తుంది. దీని వల్ల వృథాగా పడి ఉన్న బొండాల్లో నీరు నిల్వ ఉండి దోమలు పెరుగుదల నియంత్రణతో పాటు... చెత్త రహితంగా చేయటం... ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దటానికి మార్గం దొరికిందంటున్నారు గ్రామస్థులు, అధికారులు.
ఆలోచన ఉండాలే కాని వ్యర్థమంటూ ఏదీ ఉండదు... అన్నిటిని అర్థవంతంగా మర్చుకోవచ్చని నిరూపించారు. ప్లాస్టిక్ రహిత గ్రామానికి బాటలు వేసి.. ఇతర నర్సరీలకు ఆదర్శంగా నిలిచారు.
- ఇవీ చూడండి: తిరుగుబాటు అభ్యర్థుల్ని బుజ్జగిస్తున్న పార్టీలు