పసిప్రాయంలోనే దేశానికి తనవంతు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నది ఆ అమ్మాయి కల. తను ఎంచుకున్న క్రీడారంగం నుంచే అది సాధ్యమని భావించింది. కానీ పేదరికం తనను ఇబ్బందులకు గురిచేసింది. వనపర్తి జిల్లా మదనపురం మండలం కొన్నూరు గ్రామానికి చెందిన గంటల గోపాల్ రెడ్డి, రామేశ్వరమ్మ దంపతులకు ముగ్గురు పిల్లలు కాగా.. రెండో సంతానంగా సింధు జన్మించింది. సింధుకు చిన్నతనం నుంచే క్రీడల పట్ల మక్కువ ఏర్పడింది. ఒక వైపు వ్యవసాయం, మరోవైపు పెట్రోల్ బంకులో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు గోపాల్ రెడ్డి. కుటుంబ పోషణ, ముగ్గురు పిల్లలను చదివించడం గోపాల్ రెడ్డికి తలకు మించిన భారంగా తయారైంది. ఈ పరిస్థితుల్లో సింధు లక్ష్యాన్ని నెరవేర్చాలంటే ఆ తల్లిదండ్రులకు సాధ్యమయ్యే పనికాదు. కూతురు లక్ష్యం చేరుకోవాలనే ఉద్దేశంతో నాలుగో తరగతిలో హాకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో సింధును చేర్పించారు.
అనేక పతకాలు
హాకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో చేరిన సింధు తల్లిదండ్రుల ప్రోత్సాహం, సీనియర్స్, కోచ్ల సహాకారంతో ఏడు తరగతిలో వెయిట్లిప్టింగ్ క్రీడను ఎంచుకుంది. అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక పథకాలను సొంతం చేసుకుంది. సాధించాలనే తపన ఉంటే ఏ పేదరికం అడ్డుకాదని నిరూపించింది. పది సంవత్సరాల నుంచి వెయిట్ లిఫ్టింగ్లో రాణిస్తున్న సింధు హర్యానాలో జరిగిన జాతీయ జూనియర్ చాంఫియన్ షిప్లో రజతం, తమిళనాడులో జరిగిన విశ్వవిద్యాలయాల చాంఫియన్ షిప్లో బంగారు పతకం, మహారాష్ట్రలో జరిగిన జూనియర్ నేషనల్లో కాంస్య పతకాలు సాధించింది.
ఒలింపిక్స్లో బంగారు పతకమే లక్ష్యం
జాతీయ స్థాయిలో అనేక పథకాలు సాధించిన సింధు 22 ఏళ్లకే స్పోర్ట్స్ కోటాలో కోల్కతా ఆదాయపన్ను శాఖ విభాగంలో టీఏ ఉద్యోగాన్ని సాధించింది. తల్లిదండ్రులు, సీనియర్స్, కోచ్ల సహాకారంలో ఇదంతా సాధ్యమైంది అంటున్న సింధు... ఒలింపిక్స్లో భారత్ తరపున పాల్గొని బంగారు పతకం సాధించడమే తన ముందున్న లక్ష్యం అంటోంది.
క్రీడలంటే ఎంతో ఇష్టం
చిన్నతనం నుంచే క్రీడలంటే సింధుకి ఇష్టమని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. సింధు ఇష్టాన్ని కాదనలేక స్పోర్ట్స్ స్కూల్లో పుట్టెడు దు:ఖంతో చేర్పించామని తెలిపారు. తమ నమ్మకాన్ని వమ్ము చేయకుండా జాతీయ స్థాయిలో పథకాలు సాధిస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. స్పోర్ట్స్ కోటాలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం తమ గౌరవాన్ని పెంచిందని ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ సింధుకు తల్లిదండ్రుల సహకారంతో పాటు రాష్ట్ర క్రీడాపాధికారిక సంస్థ ప్రోత్సాహం ఉంటుందని ఆ శాఖ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: బావిలో నుంచి తీసే క్రమంలో చిరుత పరార్..