ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యాన్ని తూర్పార పట్టి ఎలాంటి మట్టి పెల్లలు లేకుండా తీసుకురావాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ సూచించారు. శుక్రవారం ఆమె గోపాల్ పేట మండలం తాడిపర్తి, చెన్నూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
గన్నీ బ్యాగులు, ఇతర సౌకర్యాలు, సబ్బుతో చేతులు కడుగుతున్నారా అని తదితర విషయాలపై కలెక్టర్ రైతులను అడిగి తెలుసుకన్నారు. అన్నదాతలకు టోకెన్ల ప్రకారం కొనుగోలు చేస్తున్నారా లేదా అని ఆరా తీశారు. ధాన్యంలో ఎలాంటి మట్టి, తేమ లేకుండా తీసుకొచ్చేలా చూడాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని రైతులు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని హమీ ఇచ్చారు.
అనంతరం కలెక్టర్ యాస్మిన్.. గ్రామంలో మురికి కాల్వను పరిశీలించారు. చెన్నూరులో శ్మశాన వాటిక, హరితహారం నర్సరీని తనిఖీ చేశారు. నర్సరీలో చనిపోయిన మొక్కల స్థానంలో రెండు రోజుల్లో కొత్తవి ఏర్పాటు చేయాలని.. సంచుల్లో మట్టిని నింపే పనులన్నీ రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇవీ చూడండి: టార్పాలిన్ల సరఫరాకు చేతులెత్తేసిన గుత్తేదారు.. టెండర్లు రద్దు