చిరుధాన్యాలతో ఆహార ఉత్పత్తుల తయారీలో శిక్షణనిచ్చి... మహిళలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తోంది వనపర్తి జిల్లా కృషివిజ్ఞాన కేంద్రంలోని గృహవిజ్ఞాన విభాగం. సొంతంగా యూనిట్లు ఏర్పాటు చేసుకోవడంలోనూ వారికి సహాయపడుతోంది. రాగులు, కొర్రలు, సజ్జలు, జొన్నలు, ఊదలు, సామలతో బిస్కెట్లు, మురుకులు, బూందీ తయారు చేయడంలో శిక్షణనిస్తున్నారు. ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగపడుతున్న ఈ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకుంటూ... ఆర్థికంగానూ మహిళలు లాభపడుతున్నారు.
కృషి విజ్ఞాన కేంద్రంలో శిక్షణ పొందిన మహిళలు తయారీ కేంద్రాల్లో పనిచేస్తున్నారు. కొంతమంది సొంతంగా తయారీ యూనిట్ను ఏర్పాటు చేసుకుని... ఉత్పత్తులను మార్కెట్లో విక్రయిస్తున్నారు. చిన్నచిన్న ఆర్డర్లు తీసుకుని చిక్కీలు, బిస్కెట్లు, లడ్డూలు, బూందీ తయారు చేసి నెలకు ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ఇది కేవలం కృషి విజ్ఞాన కేంద్రంలో శిక్షణ తీసుకోవడం వల్లే సాధ్యమవుతోందని మహిళలు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ పోషన్ అభియాన్లో భాగంగా అంగన్వాడీల్లో పెరటి తోటల పెంపకం, పిల్లల కోసం బలవర్థక ఆహార ఉత్పత్తుల తయారీ పైనా శిక్షణ అందిస్తోంది. ప్యాకింగ్, మార్కెటింగ్లోనూ మెళకువలు నేర్పిస్తామని కేవీకే శాస్త్రవేత్తలు తెలిపారు. శిక్షణ తర్వాత సొంతంగా యూనిట్ నెలకొల్పేందుకు సహకరిస్తామని వెల్లడించారు. 40శాతం మహిళలు వ్యవసాయం చేసినా... సరైన ఆదాయం ఉండదు. అలాంటివారికి ఎలాంటి ఉత్పత్తులు తయారు చేయాలి... వాటిని విక్రయించడానికి అవసరమైన శిక్షణను అందిస్తామని తెలిపారు.
మహిళలకు ఉపాధితోపాటు బలవర్థకమైన ఆహారంపై అవగాహన కల్పించడం గృహ విజ్ఞాన విభాగం ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం కొన్నిగ్రామాల్లోనే అందుబాటులో ఉన్న... ఈ శిక్షణ కార్యక్రమాలు... వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల్లోని ఔత్సాహిక మహిళలు ముందుకొస్తే వివిధ అంశాలపై నైపుణ్యాలందిచేందుకు కేవీకే సిద్ధంగా ఉందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.