సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టు పనులు 70శాతం పూర్తయ్యాయి. 2009 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 1.4 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం రీడిజైన్లో భాగంగా 8.23 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి పెంచింది. తద్వారా గుడాటిపల్లి గ్రామంతో పాటు పంచాయతీ పరిధిలోని తెనుగుపల్లి, మద్దలపల్లి, చింతలతండా, సోమజితండా, జాల్భాయ్ తండాలు కూడా గౌరవెల్లి ప్రాజెక్ట్లో ముంపునకు గురవుతున్నాయి. తరచుగా గుడాటిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కొందరు భూనిర్వాసితులు తమకు న్యాయమైన పరిహారం ఇవ్వాలంటూ... గౌరవెళ్లి ప్రాజెక్టు పనులను అడ్డుకుంటున్నారు.
పరిహారంతో ఎకరం స్థలం రావట్లే!
రీడిజైన్లో భాగంగా ప్రాజెక్ట్ నిర్మాణం కోసం దాదాపు 4000 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు పనుల ప్రారంభ సమయంలో ఎకరానికి 2లక్షల 10వేల రూపాయల చొప్పున పరిహారాన్ని రైతులకు అందించింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రీడిజైన్లో భాగంగా ఎకరానికి 6లక్షల 95వేల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని రైతులకు అందిస్తోంది. అయితే ప్రభుత్వం ఇస్తున్న పరిహారంతో బయట ఎకరం స్థలం కూడా రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
మేం నష్టపోయాం.. ఆదుకోండి:
తమకు ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలంటూ... వీరు కోర్టును ఆశ్రయించారు. ఆర్ అండ్ఆర్ ప్యాకేజీ కింద 936 కుటుంబాలను గుర్తించి... వారికి ఎనిమిది లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 136 కుటంబాలు తమకు పరిహారం సరిపోదంటూ కోర్టును ఆశ్రయించారు. ఇందులో 59 మంది పేర్లు ఒకే కుటుంబం కింద గెజిట్లో ప్రకటించారు. కొంతమందికి గెజిట్లో పేరు ఉన్నా పరిహారం అందలేదు. ఇంకా గ్రామంలోని 23 కుటుంబాలను గెజిట్లో గుర్తించలేదు. 12 కుటుంబాలకు పూర్తి పరిహారం అందలేదు.
8 లక్షలు ఇవ్వండి:
అదేవిధంగా ముంపునకు గురవుతున్న గ్రామంలోని 146 మంది యువకులకు 2015 వరకు కట్ ఆఫ్ పెట్టి 2 లక్షల రూపాయల చొప్పున ఇస్తామన్నా... ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పుడు 2019 సంవత్సరం వరకు గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన యువకులకు 8 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని యువకులు డిమాండ్ చేస్తున్నారు.
మాకు న్యాయం చేయండి:
గుడాటిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో ఇంటిని, భూమిని సమస్తం కోల్పోయి సంవత్సరాల తరబడి పరిహారం కోసం రెవెన్యూ కార్యాలయల చుట్టూ తిరుగుతున్నా... తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఓ వైపు కాలేశ్వరం ప్రాజెక్టు పూర్తై గోదావరి నీటి ప్రవాహం మిడ్ మానేరు నుంచి గౌరవెల్లి ప్రాజెక్టుకు త్వరలో రానుంది. ఇప్పటికే దాదాపు 70 నుంచి 80 శాతం వరకు ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. రానున్న ఆరు నెలల లోపల ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే ముంపునకు గురవుతున్న కొంత మంది భూ నిర్వాసితులు ఇంకా తమకు పరిహారం అందలేదని ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చూడండి: 36 ఏళ్ల క్రితం ప్రపంచకప్ను ముద్దాడిన క్షణం..