కోదాడ తాజా మాజీ ఎమ్మెల్యే, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి సతీమణి నల్లమాడ పద్మావతి రెడ్డిని హుజూర్నగర్ ఉపఎన్నిక బరిలో దింపుతున్నట్లు ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. హైదరాబాద్ జేఎన్టీయూలో ఆర్క్టెక్స్ర్లో బీటెక్ పూర్తి చేసి ఇంటీరియర్ డిజైనర్గా స్థిరపడ్డ ఆమె ఏపీ అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ఆర్డీ రెడ్డి కుమార్తె, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి సతీమణి. పద్మావతి రెడ్డి తన భర్త ఉత్తమ్ కుమార్ రెడ్డి గత కొన్నేళ్లుగా రాజకీయాల్లో ఉండడం వల్ల పరోక్షంగా రాజకీయ నేపథ్యం కలిగి ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తరువాత మొట్టమొదటిసారి కోదాడ నుంచి ఆమె... హుజూర్నగర్ నుంచి ఆమె భర్త ఉత్తమ్కుమార్ రెడ్డిలు పోటీలో దిగి ఇద్దరూ గెలుపొందారు.
ఉత్తమ్ రాజీనామాతో ఎన్నిక అనివార్యం
2018లో జరిగిన ఎన్నికల్లో తిరిగి పోటీ చేయగా.. కోదాడలో పద్మావతి రెడ్డి ఓటమిపాలు కాగా హూజూర్నగర్లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. అయితే 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తిరిగి నల్గొండ నుంచి పోటీ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. హూజుర్నగర్ స్థానం అలా ఉండగానే.. నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. దీనితో హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి ఉత్తమ్కుమార్ రెడ్డి రాజీనామా చేయడం అనివార్యమైంది.
షెడ్యూల్ వచ్చిన రోజే తెరాస అభ్యర్థి ప్రకటన
కేంద్ర ఎన్నికల కమిషన్ హుజూర్నగర్ ఉప ఎన్నికలు వచ్చే నెల 21వ తేదీన నిర్వహించాలని నిర్ణయించి ఆ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. ఆ నియోజక వర్గంలో రాజకీయ సందడి మొదలైంది. షెడ్యూల్ వచ్చిన రోజునే ఉత్తమ్పై పోటీ చేసి ఓటమిపాలైన వ్యక్తినే తెరాస తమ అభ్యర్థిగా ప్రకటించింది.
గతేడాది 756 ఓట్ల తేడాతో పద్మావతి ఓటమి
మొట్టమొదటిసారి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన పద్మావతి రెడ్డి 2014లో కోదాడ నుంచి పోటీ చేసి 13,374 ఓట్లు మెజార్టీతో తెదేపా అభ్యర్థి బొల్లం మల్లయ్యయాదవ్పై విజయం సాధించారు. 2018లో తిరిగి కోదాడ నుంచి బరిలో దిగిన పద్మావతి రెడ్డి తెరాస అభ్యర్థి బొల్లం మల్లయ్యయాదవ్ కంటే 756 ఓట్లు తక్కువ రావడం వల్ల ఓటమి పాలయ్యారు.
అధికార పార్టీకి ధీటుగా ఎదుర్కొనేందుకే
కాంగ్రెస్ అధిష్ఠానం కూడా అధికార పార్టీ అభ్యర్థికి దీటుగా ఎదుర్కొనే అభ్యర్థిని నిలబెట్టాలని భావించింది. అభ్యర్థి విషయంలో ఆ పార్టీలో భిన్నవాదనలు వినిపించినా ఉత్తమ్ సతీమణి పద్మావతి రెడ్డినే బలమైన అభ్యర్థిగా భావించి కాంగ్రెస్ అధిష్ఠానం ఆమె పేరును ఖరారు చేసింది. ప్రధానంగా తాజా మాజీ ఎమ్మెల్యే కావడం, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి సతీమణి కావడం, ఉత్తమ్ సిట్టింగ్ స్థానం కావడం, ఆ ప్రాంతంపై ఉత్తమ్ కుటుంబానికి గట్టి పట్టు ఉండడం, కాంగ్రెస్ సీనియర్లు అంతా కూడా ఆమె అభ్యర్థిత్వానికే మొగ్గు చూపడం లాంటి అంశాలు ఆమె ఎంపికకు దోహదం చేశాయని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
సిట్టింగ్ స్థానంపై కాంగ్రెస్ వ్యూహం
అధికార తెరాస అభ్యర్థి సైదిరెడ్డి గతంలో ఉత్తమ్కుమార్ రెడ్డిపై పోటీ చేసి ఓటమి పాలు కావడంతో...ఆ స్థానాన్ని దక్కించుకోడానికి తెరాస సర్వం ఒడ్డే అవకాశం ఉన్న ఈ పరిస్థితుల్లో ఉత్తమ్ పద్మావతి రెడ్డినే సరియైన అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్ఠానం భావించి ఆ మేరకు నిర్ణయం ప్రకటించింది. ఈ ఉప ఎన్నికతో ప్రభుత్వం వచ్చేది లేదు... కూలేది అంతకంటే లేదు కానీ... సిట్టింగ్ స్థానాన్ని తిరిగి చేజిక్కించుకోడానికి కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పద్మావతి రెడ్డి అయితే దీటైన పోటీ ఇవ్వడంతో పాటు గెలుపు తథ్యమన్న భావన కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.
పద్మావతి విజయం ఖాయమంటున్న కాంగ్రెస్ వర్గాలు
2014లో జరిగిన హుజూర్నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్కుమార్ రెడ్డి తన ప్రత్యర్థిపై శంకరమ్మపై 23924 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. 2018 ముందస్తు ఎన్నికల్లో ప్రత్యర్థి సైది రెడ్డిపై 7460 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ సతీమణి పేరు ఖరారు చేయడంతో గతంలో ఉత్తమ్ చేతిలో ఓటమిపాలైన సైదిరెడ్డి బరిలో దిగుతుండడంతో అతనికి దీటైన అభ్యర్థి పద్మావతి రెడ్డినేనని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇవీచూడండి: భాగ్యనగరంలో భారీవర్షం.. రోడ్లన్నీ జలమయం