సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని గ్రామస్థులు రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో హుస్నాబాద్ తర్వాత గౌరవెల్లి గ్రామమే పెద్దదని.. ఆ గ్రామంలో 1500మంది రేషన్ కార్డుదారులున్నారని.. గ్రామ విస్తీర్ణం కూడా పెరిగిందని ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకొని గౌరవెల్లిని మండల కేంద్రంగా ప్రకటించాలని కోరారు. గ్రామంలో ప్రభుత్వ భూమి కూడా నిరుపయోగంగా ఉందని, గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయితే ఆ గ్రామంతో పాటు.. ప్రాజెక్టు పర్యాటక కేంద్రంగా మారుతుందని, మండల కేంద్రానికి కావల్సిన అన్నీఅర్హతలు గౌరవెల్లికి ఉన్నాయని.. దీంతో పాటు.. చుట్టు పక్కల గ్రామాలకు గౌరవెల్లి కేంద్రంగా ఉంటుందని గ్రామస్థులు తెలిపారు.
అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉన్నా గౌరవెల్లి గ్రామాన్ని వెంటనే మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో గ్రామ ప్రజలంతా కలిసి ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే స్పందించి ప్రత్యేక చొరవ తీసుకొని మండల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మజ్జిక మొగిలి, ఉపసర్పంచ్ కొమ్ముల భాస్కర్, మాజీ ఎంపీటీసీ బైరగోని శ్రీనివాస్, వార్డు సభ్యులు దాము, వీరాచారి, శ్రీనివాస్, నాయకులు నరేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యుల ఆందోళన