ప్రతి రచయిత.. తమ రచనలను పుస్తక రూపంలోకి తెచ్చేందుకు తహతహలాడుతుంటారు. ఇందులో కొందరు సఫలమవుతారు.. మరికొందరు విఫలమవుతుంటారు. రచయితలు ఇలాంటి ఇబ్బందులు పడకుండా అంతర్జాలంలో పుస్తకాలను(ఈ-బుక్) పొందుపరచే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ-పీజీ కళాశాల. కళాశాల పీజీ తెలుగు విభాగం అనుబంధంగా ఏర్పాటైన కేవీ రాఘవాచార్య స్మారక సాహిత్య పీఠం ఇందుకు నడుం బిగించింది. కళాశాల విద్యార్థులు, అధ్యాపకులతో పాటు పూర్వ విద్యార్థులు, అధ్యాపకులకు అవకాశం కల్పిస్తూ.. రచనలను ఆన్లైన్లో ఈ-పుస్తకాల రూపంలో అందుబాటులోకి తెస్తున్నారు.
సాంకేతికత వేదికగా..
నేటి సాంకేతిక యుగంలో అత్యధికులు ఇంటర్నెట్ వినియోగిస్తుండటంతో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ-పీజీ కళాశాలలో పీఠం ఆధ్వర్యంలో ఈ-బుక్ వెలువరించాలని నిర్ణయించారు. తొలి ప్రచురణగా కళాశాలలో పీజీ వృక్షశాస్త్ర అధ్యాపకుడు డా.ఎం.శ్రీనివాస్ ‘నా మది..’లో పేరిట రూపొందించిన కవితల పుస్తకాన్ని వెలువరించారు. పీఠం ఆధ్వర్యంలో ప్రచురించే ఈ-పుస్తకాలను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రతిష్ఠాత్మక archive.org వెబ్సైట్లో లేదంటే కళాశాలకు సంబంధించిన కేవీ రాఘవాచార్య స్మారక సాహిత్య పీఠం బ్లాగ్లో చూడవచ్చు. పరిశోధన, సాహిత్యపరమైన అంశాలు వెలువరించే క్రమంలో ఐఎస్బీఎన్(ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్ నంబరు)ను సంబంధిత సంస్థ కేటాయిస్తుంది.
ఈ నేపథ్యంలో కళాశాలలో పీఠం తరఫున ఐఎస్బీఎన్లో పబ్లిషర్ ఖాతా (లాగిన్) తీసుకున్నారు. పీఠం నుంచి ఎలాంటి పుస్తక ప్రచురణ జరిగినా ఐఎస్బీఎన్ కేటాయించే అవకాశం కలిగిందని అధ్యాపకులు చెబుతున్నారు. పీజీ తెలుగు విభాగం విద్యార్థుల సహకారంతో ఈ-పుస్తకాలు రూపొందించనున్నారు. మరో ఇద్దరు అధ్యాపకులు రాసిన రెండు పుస్తకాలను త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు కృషి జరుగుతోంది. రానున్న రోజుల్లో పిల్లల కవితలు, పుస్తక సమీక్షలు సంకలనంగా తెచ్చేందుకు ప్రణాళికలు తయారు చేశారు.
‘పీఠం ఆధ్వర్యంలో అంతర్జాల ప్రచురణలు ఆరంభించాం. భాషాభివృద్ధికి ఇది దోహదం చేస్తుందని భావిస్తున్నాం’ అని ప్రిన్సిపాల్ ప్రసాద్ చెబుతున్నారు.
ఇదీ చూడండి: cabinet: కొవిడ్ పరీక్షలు పెంచండి.. వ్యాక్సినేషన్ను వేగవంతం చేయండి: కేసీఆర్