సిద్దిపేటలోని డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. సిద్దిపేటలో దాదాపు రూ.1000 కోట్ల విలువైన పనులను ప్రారంభించుకున్నామని మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేటకు ఆస్పత్రి, వైద్య కళాశాల మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే సీఎం కేసీఆర్ రెండు పడక గదుల ఇళ్ల పథకానికి రూపకల్పన చేశారని ఆయన అన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ గృహాలు నిర్మించిన ప్రాంతాలు మురికి వాడలుగా ఉండేవని... తెరాస ప్రభుత్వం నిర్మించిన కాలనీలు గేటెడ్ కమ్యూనిటీలకు దీటుగా ఉన్నాయని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
సిద్దిపేటలో 2,480 రెండు పడక గదుల ఇళ్లు పూర్తి చేశామని మంత్రి వెల్లడించారు. రూ.45 కోట్ల వ్యయంతో సిద్దిపేటకు ఐటీ టవర్ కూడా మంజూరు చేశారని తెలిపారు. యువతకు ఐటీ ఉద్యోగాలపై శిక్షణ కల్పించి ఉద్యోగం కల్పించే బాధ్యత తీసుకుంటామన్నారు. సిద్దిపేట ప్రాంతంపై సీఎం కేసీఆర్ కన్న కలలు సాకారం అవుతున్నాయని మంత్రి హరీశ్ స్పష్టం చేశారు. సిద్దిపేట పట్టణానికి మరో వెయ్యి రెండు పడక గదుల ఇళ్లను మంజూరు చేయాలని ముఖ్యమంత్రికి మంత్రి హరీశ్ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: 'సిద్దిపేట ఎంతో క్రియాశీలకం.. భవిష్యత్లో అంతర్జాతీయ విమానాశ్రయం'