ఈసారి వర్షాకాలం ప్రారంభం నుంచే సమృద్ధిగా వర్షాలు పడుతుండటం వల్ల చెరువులు, కుంటలు,వాగులు అన్ని జలకళను సంతరించుకున్నాయి. సిద్దిపేట జిల్లా తొగుట మండలం రాంపూర్ వాగు గడ్డ చౌరస్తా వద్ద సమృద్ధిగా కురుస్తున్న వర్షాల కారణంగా కూడవెల్లి వాగు పొంగి పొర్లుతూ పరవళ్లు తొక్కుతోంది. పై నుంచి వస్తున్న వరదలతో చెక్ డ్యాములు అన్ని నిండి పొంగి పొర్లుతూ అద్భుత జలపాతాన్ని తలపిస్తోంది.
ఈ అద్భుత దృశ్యాన్ని గ్రామస్థులు, అటుగా వెళ్లే ప్రయాణికులు తమ కెమెరాలలో బంధిస్తూ సెల్ఫీలు దిగుతున్నారు. చెక్ డ్యాంపై నుంచి నీరు జాలువారుతూ రాళ్ల గుట్టల మధ్య పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుంటే వాటి మధ్య జనాలు వలలు వేసి చేపల వేట కొనసాగిస్తున్నారు.
కూడవెల్లి వాగు జగదేవ్పూర్ మండలం చేబర్తి చెరువు నుంచి ప్రారంభమై దుబ్బాక నియోజకవర్గం గుండా వెళుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల మానేరు చెరువులో కలుస్తుంది.దుబ్బాక నియోజకవర్గ రైతులకు కూడవెల్లి వాగు జీవనాడి లాంటిది. అన్ని వాగులు వంకలు దాదాపు పడమర నుంచి తూర్పుకు ప్రవహిస్తుండగా... కూడవెల్లి వాగు మాత్రం తూర్పు నుంచి పడమరకు ప్రవహిస్తుంది. కూడవెల్లిని చూడని బతుకు కుక్క బతుకు అని ఇక్కడి నానుడి.
ఇవీ చూడండి: గోదావరిలో చిక్కుకున్న వ్యక్తి.. కాపాడిన పోలీసులు..